పెండ్లి గురించి మాట్లాడుదామని.. హాస్టల్ నుంచి తీసుకెళ్లిన యువతి కుటుంబ సభ్యులు
క్రికెట్ బ్యాట్తో దాడి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
తమ కూతుర్ని వేధిస్తున్నాడని యువతి కుటుంబసభ్యులు యువకుడిని కొట్టి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరులో బీటెక్ చదువుతున్న శ్రవణ్ సాయి(20) అదే కాలేజీలో చదువుతున్న యువతిని ప్రేమించాడు. అయితే ప్రేమ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు.. మంగళవారం రాత్రి అమీన్పూర్లో హాస్టల్ ఉంటున్న శ్రవణ్ సాయిని బయటికి తీసుకెళ్లారు. ఎందుకని తోటి మిత్రులు వారిని ప్రశ్నించగా.. వారి పెండ్లి విషయం మాట్లాడటానికి ఇంటికి తీసుకువెళుతున్నామని చెప్పారు.
ఈ క్రమంలో వారి ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించి.. క్రికెట్ బ్యాట్తో సాయిపై దాడిచేశారు. దాంతో యువకుడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళన చెందిన యువతి కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రవణ్ సాయి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, పరువు హత్య కోణంలో విచారణ చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఈ దారుణ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువకుడిని చంపిన యువతి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



