వెడ్మ బొజ్జు పటేల్ నిత్యం ప్రజల్లో ఉంటారు : కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-ఖానాపూర్
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలను కాంగ్రెస్ నాయకులు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మెన్ రాజురా సత్యం ఖండించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కంటే జాన్సన్ నాయక్ స్థానికంగా ఎక్కువగా అందుబాటులో ఉంటారని హైదరాబాద్లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్యే ప్రతిరోజూ మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా గ్రామాలు, వార్డుల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రత్యక్షంగా సమస్యలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఆ సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజలు ఆకర్షితులై గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించి పట్టం కట్టారని తెలిపారు. నియోజకవర్గంలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ గెలిచిందన్నారు. దీనితో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని ఈ ఎన్నికల్లో ప్రజాబలం స్పష్టంగా నిరూపితమైందని తెలిపారు. మరోసారి తమ ఎమ్మెల్యే జోలికి వస్తే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆదివాసీ ముద్దుబిడ్డగా ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక కేటీఆర్ ఇటువంటి మతిభ్రమించిన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ అబ్దుల్ మాజిద్, ఆత్మ చైర్మెన్ తోట సత్యం, కాంగ్రెస్ మండల జనరల్ సెక్రటరీ షబ్బీర్ పాషా, పట్టణాధ్యక్షులు నిమ్మల రమేష్, తర్లపాడ్ సర్పంచ్ సచిన్, ఉపసర్పంచ్ నర్సయ్య, నాయకులు జంగిలి శంకర్, రాజు నాయక్, గూడాల రాజన్న, శేషాద్రి, సంతోష్ ఉన్నారు.



