ఐదుగురికి గాయాలు
అంతా ఒకే కుటుంబీకులు
మహారాష్ట్రలో ఘటన
నవతెలంగాణ- కాగజ్నగర్
మహారాష్ట్రలోని లక్కడికోట-దేవాడ మధ్యలో వంతెనపై బుధవారం రాత్రి కారు అదుపు తప్పి ఒర్రెలో పడిపోవటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఒకే కుటంబానికి చెందినవారు. వివరాలిలా ఉన్నాయి.. కాగజ్నగర్కు చెందిన అఫ్ఘల్ బేగం(52), సహేరాబేగం(45), అసెర షెబ్రీం(13), సల్మాబేగం(39), నజత్ బేగం, నస్రూత్ బేగం, అబ్దుల్ రహెమాన్, షాహిన్ నిషా, అబ్దుల్ అర్మన్ నాగ్పూర్లో నివాసం ఉంటున్న బంధువు అప్సరి బేగం కుటుంబ సభ్యులను కలిసేందుకు బుధవారం ఉదయం 8 గంటలకు కారులో బయలు దేరారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రాత్రి ఒంటి గంటకు లక్కడి కోట-దేవాడ మధ్యలో వంతెన సమీపంలోకి రాగానే ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి వంతెనపై నుంచి నేరుగా ఒర్రెలో బోల్తా పడింది.
కారు నడుపుతున్న అబ్దుల్ రహెమాన్ బయటకు వచ్చి కేకలు వేయటంతో పక్కనే రోడ్డు నిర్మాణ కూలీలు సంఘటన స్థలానికి వచ్చి కారులోంచి అందరినీ బయటకు తీశారు. 20అడుగుల పై నుంచి పడి పోవటంతో అఫ్ఘల్ బేగం(52), సహేరాబేగం(45), అసెర షెబ్రీం(13), సల్మాబేగం(39) అక్కడికక్కడే మృతిచెందారు. నజత్ బేగం, నుస్రత్ బేగంను చంద్రాపూర్ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్ తెలిపారు. రహెమాన్తోపాటు మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఘటనపై వెంటనే రహెమాన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించటంతో కాగజ్నగర్ నుంచి రాత్రికి రాత్రే బంధువులు బయలుదేరి వెళ్లారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల వరకు పోస్టుమార్టం చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతా ఒకే కుటుంబం కావడంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.



