అమెరికా సైనికచర్యకు దిగితే.. ఊరుకోం
‘భారతీయుల అరెస్టు’ పూర్తిగా అవాస్తవం
సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు : ఇరాన్ విదేశాంగ మంత్రి అరఖ్చి
టెహ్రాన్ : ఇరాన్లో నిరసనలు ‘రక్తపాత ప్రేరేపిత ‘ఉగ్రవాదులు’గా మారితే చూస్తు ఊరుకోబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అరఖ్చి స్పష్టం చేశారు. విదేశీ శక్తులు ఆజ్యం పోసిన అశాంతిగా అభివర్ణించారు. నిరసనకారుల పేరిట ట్రంప్ జోక్యం తగదని, తామూ బలమైన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. తమ పరిపాలన సజావుగా సాగుతుంటే.. ఇరాన్ ప్రతిపక్ష నాయకులతో అమెరికా కవ్వింపు చర్యలకు దిగుతోందని తెలిపారు. భద్రతా దళాల సభ్యులు సహా రెండు వారాల నిరసనల్లో మరణించిన ”అమరవీరులకు” ఇరాన్ ప్రభుత్వం మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. ఇటీవల 100 మందికిపైగా భద్రతా సిబ్బంది మరణించారని ఇరాన్ మీడియా నివేదించింది. అయితే ప్రతిపక్ష కార్యకర్తలు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని, వందలాది మంది నిరసనకారులు ఉన్నారని తెలిపింది.
‘భారతీయుల అరెస్టు’ పూర్తిగా అవాస్తవం
ఇరాన్లో కొనసాగుతున్న నిరసన నేపథ్యంలో భారతీయులు, ఆఫ్ఘన్ పౌరులు అరెస్టయ్యారన్న వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. ఆ కథనాలు పూర్తిగా అవాస్తవని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబారి మహ్మద్ పథాలి ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలను నమ్మవద్దని సూచించారు. విశ్వసనీయమైన, ధృవీకరించబడిన వేదికల నుంచే సమాచారం తెలుసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. పది మంది ఆఫ్ఘన్ పౌరులు, ఆరుగురు భారతీయులు.. పలువురు ఇరానియన్లతో కలిసి అరెస్టయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఇరాన్లో భారతీయులు, భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళన తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాయబారి ఫథాలి స్పందించారు. ”ఇరాన్ పరిస్థితులపై కొన్ని విదేశీ ‘ఎక్స్’ ఖాతాల్లో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అబద్ధం. అందరూ నమ్మకమైన, విశ్వసనీయ వనరుల నుంచే సమాచారం తెలుసుకోవాలి” ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారతీయ విద్యార్థులు సురక్షితం : వైద్య సంఘాల భరోసా
భారత్లో ఆందోళన చెందుతున్న విద్యార్థుల కుటుంబాలకు ఊరట కలిగించేలా ఆలిండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎంఎస్ఏ), ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్స్ (ఎఫ్ఏఐఎంఏ) సంయుక్తం గా ప్రకటన విడుదల చేశాయి. ఏఐఎంఎస్ఏ, ఎఫ్ఏఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ మహ్మద్ మొమిన్ ఖాన్ మాట్లాడుతూ.. ”ఇరాన్లో ఉన్న మన విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు” అని తెలిపారు. ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. విద్యార్థులు, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం భారతీయులకు ఎలాంటి తక్షణ ప్రమాదం లేదని ఏఐఎంఎస్ఏ, ఎఫ్ఏఐఎంఏ స్పష్టం చేశాయి.



