ఫైనల్లో చోటు కోసం టైటాన్స్, రాయల్స్ ఢీ
ఐపీఎల్ 19 క్వాలిఫయర్ పోరు నేడు
న్యూ చంఢీగడ్ : వైభవ్ సూర్యవంశీ అసమాన బ్యాటింగ్ హీరోయిక్స్తో ఎలిమినేటర్లో బలమైన సన్రైజర్స్ హైదరాబాద్పై గెలుపొందిన రాజస్తాన్ రాయల్స్ నేడు క్వాలిఫయర్2లో గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. బ్యాట్తో వైభవ్ సూర్యవంశీ, బంతితో జోఫ్రా ఆర్చర్లు తొలి పది ఓవర్లలోనే రాజస్తాన్ను గెలుపు బాటలో నడిపించారు. బ్యాటింగ్ లైనప్లో వైభవ్ సూర్యవంశీకి తోడుగా ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ మెరిస్తే నేడు రాజస్తాన్ రాయల్స్కు తిరుగుండదు. జోఫ్రా ఆర్చర్కు సైతం సహచర బౌలర్లు యశ్ రాజ్, సుశాంత్ మిశ్రా, బర్గర్, జడేజాలు వికెట్ల వేటలో అండగా నిలిస్తే గుజరాత్ టైటాన్స్కు కష్టాలు తప్పవు. బ్యాటింగ్కు అనుకూలించే న్యూ చంఢీగడ్లో ఓటమెరుగని రికార్డు రాజస్తాన్ రాయల్స్కు అతి పెద్ద బలంగా మారనుంది. ఇదే సమయంలో గుజరాత్ టైటాన్స్ సైతం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ సహా జోశ్ బట్లర్, వాషింగ్టన్ సుందర్లు రాణించటంపై టైటాన్స్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్లతో కూడిన టైటాన్స్ బౌలింగ్ బృందం ఈ సీజన్లో నిలకడగా రాణించింది. వైభవ్ సూర్యవంశీని కట్టడి చేయటంపైనే దృష్టి సారించనున్న టైటాన్స్ బౌలర్లు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐపీఎల్ 19 ఫైనల్లో చోటు కోసం రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ పోటీపడుతుండగా క్వాలిఫయర్ 2 పోరు నేడు.



