- Advertisement -
- డాక్టర్ సీహెచ్ పరశురాం
- నవతెలంగాణ – రాయికల్
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడంలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్), ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్) కీలక పాత్ర పోషిస్తాయని ప్రతిమ ఆసుపత్రి నైపుణ్యాభివృద్ధి, అనుకరణ శిక్షణ విభాగం ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ సీహెచ్ పరశురాం అన్నారు. ప్రతిమ ఫౌండేషన్, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సంయుక్తంగా నిరుద్యోగ యువతకు పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో అందిస్తున్న హోం ఎయిడ్ హెల్త్, టైలరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులో శిక్షణ పొందుతున్న యువతీ, యువకులకు శుక్రవారం సీపీఆర్, ఏఈడీ వినియోగంపై అవగాహన కల్పించారు. - ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయిన సమయంలో అంబులెన్స్ వచ్చే వరకు సీపీఆర్ అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అలాగే ఏఈడీ పరికరం గుండె స్పందనను విశ్లేషించి అవసరమైతే విద్యుత్ షాక్ అందించడం ద్వారా సాధారణ గుండె స్పందనను పునరుద్ధరించడంలో సహాయపడుతుందని వివరించారు. ఏఈడీ పరికరాలు సాధారణ ప్రజలు కూడా వినియోగించగలిగేలా రూపొందించబడ్డాయని, అత్యవసర సమయాల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ సీపీఆర్, ఏఈడీ వినియోగంపై శిక్షణ పొందాలని, ప్రాణాలను కాపాడే ఈ నైపుణ్యాలను నేర్చుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిఎంఆర్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.మహేష్, ప్రతిమ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ గీతారెడ్డి, ఆర్గనైజర్ రఘుపతి, సిబ్బంది ప్రమోద్నాగేందర్, చిరంజీవి, కృష్ణవేణి, వనిత పాల్గొన్నారు.
- Advertisement -



