అధ్భుత ప్రతిభ చాటిన కళాకారుడు రజనీకాంత్
నవతెలంగాణ – కాటారం
మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కాటారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాల చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ తన కళా ప్రతిభతో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చాక్ పీస్పై గుండుపిన్ను సహాయంతో సుమారు గంటన్నర పాటు కష్టపడి 1.3 సెంటీమీటర్ల ఎత్తు మరియు 1.5 సెంటీమీటర్ల వెడల్పు గల సూక్ష్మ శివలింగాన్ని చెక్కి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఇది ఆయన కళా ప్రయాణంలో మరో విశిష్ట ఘట్టంగా నిలిచింది. గతంలో కూడా శివరాత్రి సందర్భంగా 1.5 సెంటీమీటర్ల ఎత్తు గల 109 శివలింగాలను చాక్పీస్లతో తయారు చేసి విశేష గుర్తింపు పొందారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ జెండాను తయారు చేసి “క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్”లో చోటు సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.



