పియూశ్ గోయల్ను తొలగించాలి
వరికి మద్దతు ఇవ్వొద్దన్న లేఖను ఉపసంహరించుకోవాలి
ఆ లేఖపై సంతకం చేసిన కేంద్ర కార్యదర్శిని పదవి నుంచి తొలగించాలి
ఈనెల 27న అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రతిపక్ష నేతలను కలుస్తాం :ఎస్ కెఎం నేతలు డిమాండ్
న్యూఢిల్లీ: మార్చి 9న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే ముందు వ్యవసాయ రంగాన్ని అమెరికాకు అప్పగించే వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతులను గ్రామాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) నేతలు పిలుపు ఇచ్చారు. మంగళవారం వర్చువల్ విలేకరుల సమావేశంలో ఎస్ కెఎం నేతలు విజూ కృష్ణన్, డాక్టర్ సునీలం, రాజేంద్ర క్షీర్సాగర్, సత్యవన్, పి. కృష్ణప్రసాద్ తదితరులు మాట్లాడారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయొద్దని ప్రధానమంత్రిని ఆదేశించాలని కోరుతూ రాష్ట్రపతికి బహిరంగ లేఖ రాస్తామని, దేశ వ్యవసాయం, పాడి పరిశ్రమలను బహుళజాతి కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ను తొలగించాలని కూడా లేఖలో డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. దేశం స్వావలంబన, సార్వభౌమత్వాన్ని అప్పగించడానికి వాణిజ్య శాఖ మంత్రి గోయల్ దేశద్రోహి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.
వరి రైతులకు బోనస్ ఇవ్వొద్దని రాష్ట్రాలకు పంపిన లేఖను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపసంహరించుకోవాలని, లేఖపై సంతకం చేసిన వ్యయసాయ కార్యదర్శి వి. వుయల్నామ్ ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరోగమన జీఎస్ట్టీ చట్టాన్ని సవరించడంతో రాష్ట్రాల పన్ను అధికారాన్ని పునరుద్ధరించాలని పార్లమెంటును డిమాండ్ చేయాలని, ప్రస్తుత 33 శాతానికి బదులుగా రాష్ట్రాలకు సెస్, సర్ఛార్జ్తో సహా పూల్లో 60 శాతం పన్నుల వాటాను ఇవ్వాలని, రైతులు పండించిన అన్ని పంటలకు సి2ఫ్లస్ 50 శాతంతో కూడిన ఎంఎస్పీ ఇవ్వాలని, వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి వనరులను అభివృద్ధి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈనెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులతో ఎస్ కెఎం ప్రతినిధులు సమావేశమవుతారని తెలిపారు.
రాష్ట్రపతికి లేఖ రాస్తాం
- Advertisement -
- Advertisement -



