నోటిఫికేషన్ లేకుండా సిబ్బంది నియామకం..!
పాత టెండర్ రూ.20 లక్షల బకాయిలు అంతేనా..!
దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు
నవతెలంగాణ- అచ్చంపేట
శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని ఉమామహేశ్వరం దేవస్థానంలో ఉద్యోగాల నియామకాల్లో గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం పేపర్లో టెండర్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. కానీ పాలకవర్గం, అధికారులు ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించుకుంటున్నారని ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. దీంతో దేవాలయంలో రెగ్యులర్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఔట్సోర్సింగ్ విధానంపై ఎంతమంది ఏఏ పోస్టుల్లో పనిచేస్తున్నారు? ప్రతినెలా సిబ్బంది వేతనాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారనే వివరాలు బహిర్గతం చేయాలనే డిమాండ్ వస్తుండటంతో ఉమామహేశ్వర దేవస్థానం మరోసారి చర్చల్లోకి వచ్చింది. దీంతోపాటు గతంలో కొబ్బెర కాయల వేలం పాట పాడిన వ్యక్తి నుంచి రూ.20 లక్షల బకాయిలు వసూలు చేయడంలో పాలకవర్గం, దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. దేవస్థానంలో రోజువారీగా వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా లెక్కలు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారని సమాచారం. ఉమామహేశ్వరం దేవస్థానం నుంచి రెండు బస్సులను కొనుగోలు చేసినట్టు కార్యనిర్వహణ కార్యదర్శి ఈవో శ్రీనివాసరావు చెపుతున్నారు. కానీ ఆ బస్సులు పర్వతాలు అనే వ్యక్తిపై ఆర్టీఓ శాఖలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ప్రతినెలా దేవాలయం నుంచి ఫైనాన్స్ వారికి ఇఎంఐ చెల్లిస్తున్నారు. దీనిలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. దేవస్థానంలో సందర్శకులను కొండపైకి తీసుకుపోవాల్సిన బస్సులు హైదరాబాద్లో ఎందుకు తిరుగుతున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. బస్సుల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని ఓ వ్యక్తి హైదరాబాద్లోని కమిషనర్, దేవాదాయ శాఖకు, సీబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. పవిత్రమైన ఉమామహేశ్వర దేవస్థానంలో అవినీతికి తావు లేకుండా వసతులు, సౌకర్యాల కల్పనకు నిధులు ఖర్చు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు.
ఉమామహేశ్వరం దేవస్థానంలో గందరగోళం..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



