ఫారెస్ట్ అధికారులను కలిసిన గ్రామాల సర్పంచులు, ప్రజలు
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల పరిధిలోని కొన్ని గ్రామాల పొలిమెరలలో ఈ మధ్య పులిసంచారం కలకలం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల సర్పంచులు, గ్రామాల ప్రజలు జుక్కల్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెల రోజులుగా చిరుతపులి మండల పరిధిలోని గ్రామాలలో సంచరిస్తున్న విషయం మీకు తెలియంది కాదని అన్నారు. దీంతో రైతులు, గ్రామస్థులు గ్రామ పొలిమేరలకు వెళ్ళాలంటే జంకుతున్నారని తెలిపారు. విద్యార్థుల పరిస్థితి చెప్పతరం కాదని అన్నారు. చిరుత దాని పిల్లలను వేసుకుని ఊరూరా తిరుగుతుంటే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని అభ్యర్థించారు. చిరుత దాడితో ఇప్పటికే గ్రామాల్లోని ఆవుదూడలు మృత్యువాత పడ్డాయని ఆవేదన చెందారు. అంతేకాకుండా కొంతమంది జనాలపై దాడిచేసిన దాఖలాలు లేకపోలేదని అన్నారు.
ఇంత జరుగుతున్నా.. మీకు సమాచారం అందించినా మీరు నిమ్మకునీరత్తనట్టు వ్యవహరించడం సరైన పద్దతి కాదని అన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో చిరుతను కట్టడి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనియెడల కలెక్టరేట్ ను ముట్టడించి మా సమస్యను పరిష్కరించమని కోరుతామని తెలిపారు. అవసరమైతే ఫారెస్ట్ కమీషనర్ ను కలవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.



