జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్
నవతెలంగాణ – తుంగతుర్తి
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈనెల 25వ నుండి ప్రారంభమై మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్ అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 16,178 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలను కేటాయించడం జరిగిందని, ప్రతి కేంద్రంలోనూ ఒక సిఎస్, డివో తో పాటు పర్యవేక్షణ కోసం ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు.
అదేవిధంగా జిల్లాలో ఇద్దరు డిసీలను,రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు,ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులను నియమించడమే కాకుండా, పరీక్షల నిర్వహణలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షల సమయపాలన విషయంలో అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుందని తెలిపారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేయబడతాయని స్పష్టం చేశారు.
హాల్ టికెట్లు ఇతర ముఖ్యమైన పత్రాలను విద్యార్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పరీక్షల సమయానికి విద్యార్థులు మానసికంగా సిద్ధంగా ఉండాలని భాను నాయక్ ఆకాంక్షించారు.



