Thursday, February 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఈ కన్నీళ్లకు కారకులెవరు?

ఈ కన్నీళ్లకు కారకులెవరు?

- Advertisement -

”అయ్యా! రూపాయి రూపాయి కూడేసి కష్టార్జితంతో కట్టుకున్న ఇండ్లు! కూల్చకండి నాయనా!! ఒకవేళ నా గూడు కూల్చే ముందు నన్నే చంపేయండి” ఖమ్మం భూదాన్‌ భూముల్లోని నివాసాలను ప్రభుత్వం జేసీబీ యంత్రాలతో కూల్చివేసినప్పుడు గూడు కోల్పోయిన ఓ వృద్ధురాలు వ్యక్తం చేసిన ఆవేదన. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యం చూసిన ఎవరికైనా మనసు కలచివేస్తుంది. మూడు జిల్లాలో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు శత్రుదేశంపై దండెత్తిన విధంగా ఆ గ్రామంపై దాడికి దిగారు. పదేళ్లుగా ఖమ్మం పట్టణం వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో నివశిస్తున్న ఐదు వందల పేద కుటుంబాలు సెంటు భూమిలో కట్టుకున్న శ్రమసౌదాలు ఒక్కొక్కటి కూలిపోతుంటే బడుగులు గుండెలవిసేలా ఏడుస్తున్న దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి.

నిర్భాగ్యులు, నిరాశ్రయుల వేదన సైతం పంచుకునే నాధుడే లేకుండా మంత్రాంగం నడిపాయి పాలకవర్గాలు. పోనీ అదేమైనా నిర్మానుష్య ప్రాంతమా? లేదే! ఖమ్మం కలెక్టరేట్‌కు కనుచూపు లోపలి దూరం, తూర్పున వరంగల్‌-విజయవాడ జాతీయ రహదారి, దక్షిణాన గత ప్రభుత్వంలో అధికారం వెలగబెట్టి, బీదల కాలనీకి కరెంట్‌, మంచినీరు అందకుండా చేసిన ‘గులాబీ’ పార్టీ, మాజీమంత్రికి చెందిన విలువైన భూములు, పడమర వైపు రోడ్డుదాటితే తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎస్టేట్‌ భూమి, ఆ పక్కనే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరుడి రియల్‌ వెంచర్‌, దానికి నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలకు మధ్య వ్యవసాయ మంత్రి తుమ్మల కొనుగోలు చేసిన భూములున్నాయట! ఇవ్వన్నీ వందల ఎకరాలు, కోట్లాది రూపాయలు విలువ చేసే మూడు తరాల వరకు అనుభవించినా తరగని ఆస్తులు. ఒకప్పుడు ఇవన్నీ ప్రభుత్వ భూములే. పట్టా భూములుగా ఎలామారాయో ఆ రహస్యం ఎవరికి తెలియదు.

అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం, ఇప్పటి రేవంత్‌ సర్కార్‌ పెద్దలు ఈ భూములపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక్క విచారణ చేయలేదు. కేవలం వందగజాల ఇరుకు భూమిలో అవి భూదాన భూమిలో వేసుకున్న పేదల గుడిసెల్ని ఇంత దారుణంగా కూల్చివేయడం ఏమిటో అర్థం కాని విషయం. ఇక్కడ నివసించిన ప్రజలు దొంగతనంగా గుడిసెలు వేయలేదు.ఎప్పుడో పన్నెండేండ్ల కిందట ఇందిరమ్మ బొమ్మతో ఇచ్చిన ఇంటి పట్టాలు ఆధారంగా నిర్మించుకున్నవే! అందుకు బలంగా అనేక కోర్టు ఉత్తర్వులు రక్షణగా ఉన్నాయి. వినోబావే కాలనీగా పిలువబడే దీని ఎదురుగానే పరదాలు కట్టి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ బహిరంగసభ నలుగురు ముఖ్యమంత్రుల సాక్షిగా లక్షల మందితో జరిగింది.

పడమరవైపున వాగ్దానాలు వర్షం కురిపించి, ఒక్కటీ నేటికీ అమలుచేయని కాంగ్రెస్‌ రాహుల్‌ గాంధీ భారీ బహిరంగసభ ఇక్కడే జరిగింది.అదీ పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిక, బట్టి పాదయాత్ర ముగింపు సభ, ఇన్ని చారిత్రక సభలకు మౌనసాక్ష్యంగా ఉన్న వినోబావే కాలనీ ఇప్పుడు కూల్చివేత వెనుక మతలాబు ఏమిటో అర్థంకాని పరిస్థితి. పేదల ఇళ్లు ఖాళీచేస్తే కోర్టు ఉత్తర్వులతో ఆ భూమిలో వారి సొంతం చేసుకోవాలని గద్దల్లా ఎదురుచూస్తున్న రియాల్టర్‌ పవర్‌ బ్రోకర్ల నీడలో జరుపుతున్న ఈ కూల్చివేతలే! రేపటి అహంకార, అధికార కూకటివేళ్లను పెకలించే శాపవచనాలుగా పేదల హాహాకారాలు నిలువనున్నాయి. ఈపేదల గుడిసెలు కూల్చివేతతో రాజకీయ రంగుతో పాటు, అధికారానికి వంత పాడే మీడియా చిలక పలుకులు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో రేపు ఎంత దౌష్ట్యం పేదలకు ఇంకా మిగిలి ఉందో తెలియదు.

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా వివిధ ప్రతిపక్ష రాజకీయ పక్షాల పరామర్శలు కూడా వారికి స్వాంతన చేకూర్చలేవు.ఇంత జరిగినా శిధిలగృహాలు ముందు సాగిలపడి చేస్తున్న పోరాటం ప్రజాపట్టుదలను సూచిస్తుంది.రేవంత్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదోరకంగా పేదల గృహాలను మట్టుబెడుతోంది. మూసీ సుందరీకరణ పేరుతో బలవంతంగా పేదల ఇండ్లను ఖాళీ చేయిస్తోంది. హైడ్రాను తీసుకొచ్చి అక్రమ కట్టడాలంటూ కూల్చివేస్తోంది. పేదల పొట్టగొట్టే ఏ భూదందా అయినా అధికార ఇటుకల్ని బలహీన పరిచేవే, అధికారపు కూకటి వేళను బలహీన పరిచేవే !! అధికారం అనేది ఆహాంకారాన్ని అమాంతం పెంచుతుంది.దాని పర్యావసానాలు పశ్చాత్తాపాలుగా బయటపడతాయి.బాధితులు వందలే కావచ్చును, దాని సానుభూతి పరిది ఎనభై శాతం పేద ఓటర్లను ప్రభావితం చేస్తుంది. ఖమ్మం లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా చూసుకోవడం ముఖ్యమంత్రి రాజకీయ పరిపక్వతకు నిజంగా ఇప్పుడు అగ్నిపరీక్షే.

ఎన్‌.తిర్మల్‌
9441864514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -