నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వైభవంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. భువనగిరి మండలం పరిధిలోని తాజ్పూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సైన్స్ ఫేర్లో విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు నమూనాలు, ప్రాజెక్టులు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఇంత పెద్ద స్థాయిలో సైన్స్ ఫేర్ నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వివరించడం చాలా సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా తత్వం పెరుగుతుందని తెలిపారు.
అనంతరం డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ తమ గ్రామంలో నిర్వహించిన ఈ సైన్స్ ఫేర్ ఇప్పటివరకు ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ స్థాయిలో జరగలేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవని, ఇక్కడి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడుతున్నాయని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకొని తమ పిల్లలను ఇక్కడే చదివించాలని ఆయన సూచించారు.
అయితే ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో హాజరుకాకపోవడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. పిల్లల ప్రతిభను ప్రోత్సహించడానికి తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయం ప్రస్తావిస్తూ, త్వరలోనే ఆ కొరతను తీర్చేందుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన ఎటువంటి సహాయం కావాలన్నా ముందుండి సహకరిస్తామని, వారి విద్యాభివృద్ధికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి నరేందర్ నాయక్, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, బొమ్మరపు లక్ష్మీ బాల్రాజ్, ఎస్.కె గాలిబియాకుబ్, ఎస్.కె హైమద్, వరిగంటి మానస నాగరాజు, గ్రామ ప్రజలు, అగ్రికల్చర్ స్టూడెంట్ యాదాద్రి మెడికల్ కాలేజ్ డాక్టర్స్ పాల్గొన్నారు.



