అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు
మాటల : గన్పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు జూపల్లి,
యుద్ధంతో : పొన్నం, అడ్లూరి, అజహరుద్దీన్
వేడెక్కిన తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత గన్పార్క్కు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతల యత్నం
రాజకీయం : హరీశ్రావు సహా పలువురి నాయకుల అరెస్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో హైదరాబాద్ నగరం అట్టుడికింది. నాయకుల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో గురువారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర అప్పు, గురుకుల విద్యాసంస్థల టెండర్లలో అవినీతి అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తీవ్ర దుమారం రేపాయి. రైతాంగానికి ప్రభుత్వం చేసిన సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.ఆ సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. తాను చర్చకు సిద్ధమనీ, స్థలం, తేదీ చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు. రాష్ట్ర అప్పు రూ.3.50 లక్షల కోట్లని ప్రకటించారు. దీనిపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర అప్పులపై గణాంకాలతో సహా చెప్పేందుకు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్కు గురువారం ఉదయం 11 గంటలకు వస్తానని అన్నారు. ఇంకోవైపు గురుకుల విద్యాసంస్థల టెండర్లలో రూ.రెండు వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ మాజీమంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
దీన్ని సవాల్ చేస్తూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, అజహరుద్దీన్ గురువారం ఉదయం 10 గంటలకే గన్పార్క్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్కు కేటీఆర్, హరీశ్రావు వచ్చారు. అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గురుకుల విద్యాసంస్థల టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. పూర్తి వివరాలతో ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కాకుండా మాజీమంత్రి హరీశ్రావు గన్పార్క్ వద్దకు రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన హరీశ్రావు గన్పార్క్ వద్దకు వచ్చేందుకు యత్నించారు. కారులో కూర్చొగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రులేమో రమ్మంటారు, పోలీసులేమో గన్పార్క్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని హరీశ్రావు విమర్శించారు. అదే సమయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్లకు ఆయన ఫోన్ చేశారు. వారు లిఫ్ట్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కారులో వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో దిగి నడుకుంటూ వెళ్లేందుకు యత్నించారు.
దీంతో పోలీసులు హరీశ్రావు, ఇతర నాయకులను అడ్డుకుని అరెస్టు చేశారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హరీశ్రావును మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఇంకోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ వేచి చూశారు. అయితే జూపల్లి కృష్ణారావు గన్పార్క్ వద్దకు వెళ్లారు. గన్పార్క్ వద్దకు రావాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన కేటీఆర్ అక్కడికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. నా మాటలకు కట్టుబడి ఉన్నా : జూపల్లికేసీఆర్ హయాంలో రాష్ట్ర అప్పులపై తన మాటలకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.7.30 లక్షల కోట్లని వివరించారు. ఈ అప్పునకు సంబంధించిన గణాంకాలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.గురుకుల టెండర్లలో అవినీతి జరగలేదు : అడ్లూరి, పొన్నంగురుకుల విద్యాసంస్థల టెండర్లలో అవినీతి జరగలేదని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ అన్నారు.
అవినీతి జరిగినట్టు నిరూపిస్తే దేనికైనా రెడీ, అవసరమైతే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియను అధికారులు నిర్వహించారని వివరించారు. దీన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఉండగా ఫోన్ కాల్కు స్పందించలేదనీ, పిరికివాళ్లమని అనడం హాస్యాస్పదమని చెప్పారు. సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి : కేటీఆర్ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు తొడగొట్టి తోకముడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం తెలంగాణ భవన్లో కుర్చీ వేసి మూడు గంటలు వేచి చూసినా రాకుండా పారిపోయారని విమర్శించారు. తాము గన్పార్క్ వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుని డ్రామాలు ఆడారని అన్నారు. తమతో చర్చించే దమ్ము వారికి లేదన్నారు. హరీశ్రావు, ఇతర నేతల్ని అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సమస్యలపై చర్చించే దమ్ముంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను పెట్టాలని డిమాండ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ను ప్రజలు సహించబోరని అన్నారు.జూపల్లి రాజీనామా చేయాలి : హరీశ్రావుఈ ప్రభుత్వం సవాళ్లు చేసి చివరకు తోకముడిచిందని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు.
మంత్రులు గోల్ కొడతామనుకుని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయ్యిందని ఆరోపిస్తూ తెలంగాణ భవన్కు వస్తానని సవాల్ విసిరారని అన్నారు. కేటీఆర్, తాను తెలంగాణ భవన్లో ఉంటే చర్చకు రాలేదన్నారు. పాలమూరు పౌరుషం ఉంటే జూపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్న రూ.ఎనిమిది లక్షల కోట్లనీ, ఇప్పుడు రూ.ఏడు లక్షల కోట్ల అప్పు అంటున్నారని విమర్శించారు. గురుకుల టెండర్లలో అవకతవకలు జరిగాయన్నారు. అవినీతి చేసినందుకే పోలీసులను అడ్డుపెట్టుకుని మంత్రులు తప్పించుకున్నారని అన్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడూతూ రాష్ట్రంలో సర్కారు నడవడం లేదనీ, సర్కర్ నడుపుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్ర అప్పులపై వివరాలు
కాంగ్రెస్ వివరాలు – బీఆర్ఎస్ వివరాలు
2014-2023 వరకు రాష్ట్ర అప్పు 2014-2023 వరకు రాష్ట్ర అప్పు
రూ.7.30 లక్షల కోట్లు రూ.3.50 లక్షల కోట్లు
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి
వచ్చిన అప్పు రూ.72,658 కోట్లు వచ్చిన అప్పు రూ.72,658 కోట్లు
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు
రూ.6.71లక్ష కోట్లు రూ.2.78 లక్షల కోట్లు
(బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు రూ.3,89,673 కోట్లు,
కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు రూ.2,82,084 కోట్లు)



