మూడో విడతలో
మరో రూ.1330.32 కోట్లు
ఇప్పటివరకూ 61.35 లక్షల రైతుల ఖాతాల్లో రూ.5402.37 కోట్లు జమ :
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద మూడో విడతలో మూడు నుంచి నాలుగెకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1330.32 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు, 22.17 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించిన రైతుభరోసా సాయాన్ని పొందారని తెలిపారు. బుధవారం ఈ మేరకు మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి రెండు దశల్లో మూడెకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేశామనీ, బుధవారం మూడు నుండి నాలుగెకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుభరోసా సాయం అందించామని తెలిపారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 61.35 లక్షల మంది రైతులకు, 90.04 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించి రూ.5402.37 కోట్ల సహాయాన్ని విడుదల చేశామని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనీ, అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.



