నవతెలంగాణ-హైదరాబాద్: అధిక ద్రవ్యోల్బణంతో ఇప్పటికే పాకిస్థాన్లో నిత్యావసర ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. రంజాన్ మాసం సందర్భంగా పండ్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. తాజాగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా పాక్లో పెట్రో రేట్లు మండుతున్నాయని ఆ దేశ మీడియా సంస్థ ఏఆర్వై(ARY) న్యూస్ పేర్కొంది.
కొత్త ధరల ప్రకారం.. లీటరు పెట్రోల్కు PKR(ఆదేశ కరెన్సీలో) 321.17 కు చేరుకోగా, డీజిల్ ధరలు ప్రస్తుత PKR 275.70 నుండి PKR 335.86 కు పెరిగాయి. పశ్చిమాసియాలో వివాదం విస్తృతమైన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు.
కాగా, వారం రోజుల నుంచి ఇరాన్పై యూఎస్-ఇజ్రాయిల్ క్షిపణుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. ప్రతీదాడులకు దిగిన ఇరాన్ దళం..గల్ఫ్ దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలపై బాంబుల మోత మోగించింది. ఇజ్రాయిల్ భూభాగంపై కూడా మిస్సైల్స్ ను ప్రయోగించింది. అదే విధంగా హర్మూజ్ జలసంధి మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అటు వైపుగా వచ్చిన నౌకలపై బాంబులతో దాడి చేస్తామని హెచ్చరించింది.



