Sunday, March 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలి

పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలి

- Advertisement -

సీపీఐ( ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ డిమాండ్‌
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆందోళన
పలుచోట్ల కేంద్ర దిష్టిబొమ్మల దహనాలు, నిరసనలు
నవతెలంగాణ – దిల్‌ సుఖ్‌ నగర్‌/మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/ సిద్దిపేటఅర్బన్‌
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలకు నిరసనగా హైదరాబాద్‌ దిల్‌ సుఖ్‌ నగర్‌లో సీపీఐ(ఎం) పార్టీ అధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో సీపీఐ( ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్దాలు జరిగితే ప్రజలపై భారం ఉంటుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా గ్యాస్‌ ధరలు పెంచి బోణీ చేసిందని ఎద్దేవా చేశారు. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వంట గ్యాస్‌ ధరను రూ.60, కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.115 పెంచిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటేలా ఉన్నాయని, సగటు మనిషి జీవించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్‌ ధరలు రవాణా చార్జీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఫలితంగా ఇప్పుడున్న నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. దేశ సంపదను కేంద్రప్రభుత్వం అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేసిందని మండిపడ్డారు.. యుద్ధం ప్రారంభంలోనే గ్యాస్‌ ధర పెరిగిందని, మున్ముందు ఈ యుద్ధం ఫలితంగా భారత ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, చంద్రమోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు కేసరి నర్సిరెడ్డి, ఎల్బీనగర్‌ సర్కిల్‌ కార్యదర్శి ఎల్లయ్య, సరూర్‌ నగర్‌ సర్కిల్‌ కార్యదర్శి సీహెచ్‌ వెంకన్న, నాయకులు ఎం.వీరయ్య, గణేష్‌, కె. శ్రీనివాస్‌, కె. రాములు, లతిఫ్‌, రాధమ్మ, కాశయ్య, రమేష్‌, పురుషోత్తం, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో…
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలు ఉపసంహరించుకోవాలని, ఇప్పటికే అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు మోయలేని భారాలు మోస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. శనివారం సంగారెడ్డిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్యాస్‌ ధరల పెరుగుదలకు నిరసనగా నిరసన కార్యక్రమం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరాన్‌ మీద అమెరికా, ఇజ్రాయెల్‌ సాగిస్తున్న దుర్మార్గమైన, దౌర్జన్య పూరితమైన దాడి ఫలితమది ఆయన అన్నారు. ఆ భారాన్ని నేడు ప్రజలపై నెట్టడం ఘోరం అని, ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై వంటగ్యాస్‌ ధర పెంపు పెద్ద దెబ్బ అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ మీద పెంచిన ధరను ఉపసంహరించుకోవాలిని డిమాండ్‌ చేశారు.

సిద్దిపేటలో
సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హౌసింగ్‌ బోర్డ్‌ కమాన్‌ వద్ద ఖాళీ గ్యాస్‌ సిలిండర్‌తో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపే విధంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచిందన్నారు. ధరలు పెంచడం వల్ల అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని, ప్రజలు కొనలేని పరిస్థితికి దేశాన్ని నెట్టివేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -