నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా-ఇజ్రాయిల్ దాడులతో హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ మార్గం గుండా యూఎస్, ఇజ్రాయిల్ దేశాల నౌకలు వస్తే దాడులు చేస్తామని తీవ్రంగా హెచ్చరించింది. అయితే నౌకలు విడిచిపెట్టేందుకు.. హార్ముజ్ గుండా వెళ్లేందుకు 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు అలాయుద్దీన్ బరూజెర్ది చెప్పినట్లుగా ప్రభుత్వ రంగ మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ వెల్లడించింది.
తాజాగా ఈ అంశంపై ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. హార్ముజ్ గుండా వెళ్లడానికి 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు నిరాధారమైనవని ఇరాన్ రాయబార కార్యాలయం కొట్టిపారేసింది. హార్ముజ్ వసూలుపై ప్రకటనలు కేవలం అది వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది. ఆ ప్రకటన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధికారిక ప్రకటన కాదని.. ఆ ప్రకటనలు పరిగణనలోకి తీసుకోవద్దని సూచించింది.



