– అమ్మేవారిపై కఠిన చర్యలు
– అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే
– రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు
– పాత లబ్ధి దారులందరికీ యథాతథం
– కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలి
– ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని అప్లికేషన్లను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దనీ, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఆయా పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ది పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు.
స్విగ్గీ బారు కుటుంబానికి రూ.2లక్షల సాయం చెక్కును అందజేసిన సీఎం
నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బారు కుటుంబానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి చెక్కు రూపంలో ఆయన ఆర్థిక సాయాన్ని అందించారు. ఈనెల 23న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీఎం గిగ్ వర్కర్లతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఫుడ్ డెలివరీ బారు ప్రమాదవశాత్తు మరణించిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అతడి వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.