ప్రభుత్వానికి మితిమీరిన అధికారాలు కట్టబెట్టారు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
న్యూఢిల్లీ : తక్షణమే విదేశీ విరాళాల (క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు, 2026ను రద్దు చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఈ నెల 26న లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులోని నిబంధనల పట్ల తమకు తీవ్ర అభ్యంతరాలు వున్నాయని ఆయన తెలిపారు. రాజ్యాంగ నైతికత, ప్రజాస్వామ్య సూత్రాల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని వెంటనే ఈ బిల్లును ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆ లేఖలో బేబీ పేర్కొన్నారు. పారదర్శకత, జాతీయ భద్రతకు హామీ కల్పించేందుకు విదేశీ విరాళాలను క్రమబద్ధీకరించం ప్రభుత్వానికి గల విశేషాధికారమని తమకు తెలుసునని అన్నారు. అయితే, ప్రతిపాదిత సవరణలు సహేతుకమైన క్రమబద్ధీకరణ పరిధిని దాటి మితిమీరిన నియంత్రణకు తద్వారా ప్రభుత్వ దుర్వినియో గానికి ఆస్కారం కల్పిస్తున్నాయని అన్నారు.
1.నిర్దేశిత అధికారి ద్వారా ఆస్తుల జప్తుణకు అపరిమిత అధికారం : రిజిస్ట్రేషన్ నిలిపివేసిన, రద్దుచేసిన, లేదా పునరుద్ధరిం చబడని ఎన్జీఓలు సేకరించిన విదేశీ నిధులతో ఏర్పాటైన ఆస్తులను స్వాధీనం చేసుకునే, నిర్వహించే, విక్రయించేందుకు అధికారం కలిగిన శక్తివంతమైన ‘నిర్దేశిత అథారిటీ’ని ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇది చాలా తీవ్రమైన నిబంధన, సివిల్ సొసైటీ సంస్థల ఉనికికే ముప్పు తెస్తోంది. చాలా కేసుల్లో, దేశ, విదేశీ నిధులను కలిపి ఆస్తులను సృష్టిస్తారు. మొత్తంగా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదిత నిబంధన వల్ల స్థానిక ఆస్తులతో ఏర్పాటైన ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. తగిన రీతిలో న్యాయ పర్యవేక్షణ లేకుండా అటువంటి ఆస్తులను శాశ్వతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం, క్రమబద్ధీకరణ పర్యవేక్షణా పరిధిని మించిపోయే చర్య కాగలదు.
2.మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ, తుడిచిపెట్టుకుపోయిన సమాఖ్యవాదం : ఎఫ్సీఆర్ఏ సంబంధిత దర్యాప్తు ఏదైనా చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి కోరాలని బిల్లు పేర్కొంటోంది. ఈ నిబంధన మన రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోంది. రాష్ట్ర దర్యాప్తు అధికారాలపై కేంద్ర వీటోను విధించడం, సమాఖ్య విధానానికి విరుద్ధమైన రీతిలో అధికారాలను కేంద్రీకరిస్తోంది.
3.వ్యక్తిగత, ఏకపక్షతకు దారి తీసే విచక్షణాధికారాలు : ‘నిర్దేశిత అథారిటీ’ (డిజిగేటెడ్ అథారిటీ) దుర్వినియోగం కాకుండా వుండేందుకు తగిన రక్షణలు సూచించకుండా ఈ బిల్లు తీవ్రమైన విచక్షణాధికారాలను ఇస్తోంది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, మైనారిటీ సంక్షేమం వంటి రంగాల్లో పనిచేసే సంస్థలకు ఇది ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. చట్టాలను ఉల్లంఘించినందుకు కాకుండా ప్రభుత్వ విధానాలపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు ఈ సంస్థలు లక్ష్యంగా మారే ప్రమాదముంది. కేంద్ర హోం వ్యవహారాల పోర్టల్ ప్రకారం, ప్రస్తుతం దాదాపుగా 15వేల సంస్థలు నమోదు చేసుకున్నాయి. వాటిలో దాదాపు 20,711 సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. ఎఫ్సీఆర్ఏను కేవలం నియంత్రణా సాధనంగా కాకుండా అంతకంటే ఎక్కువగా అసమ్మతిని అణచివేసే, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సంస్థలను వేధించే రాజకీయ ఆయుధంగా పరిగణిస్తున్నారు.
4.మైనారిటీ సంస్థలపై ప్రభావం : మైనారిటీ సంస్థలను ఈ బిల్లు మితిమీరిన కఠిన నియంత్రణా పరిధి కిందకు తీసుకువస్తోంది. దీనివల్ల వాటి పనితీరులో అనవసరమైన జోక్యం ఎక్కువవుతుందనే తీవ్రమైన ఆందోళన తలెత్తుతోంది. లైసెన్సులు పునరుద్ధరించడానికి నిరాకరించే లేదా రద్దు చేయడానికి అలాగే ఈ సంస్థల నిధులు లేదా ఆస్తులపై నియంత్రణ చేపట్టడానికి ప్రభుత్వాన్ని అనుమతించే నిబంధనలు మతపరమైన, భాషాపరమైన మైనారిటీ సంస్థల నిర్వహణా హక్కుతో సహా రాజ్యాంగపరంగా హామీ కల్పించబడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రత్యక్ష ముప్పుగా వున్నాయి.
5.కొరవడిన సంప్రదింపులు : ప్రతిపక్ష సభ్యుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ ఏకపక్షంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం తీవ్ర విచారకరమైన అంశం. ఈ బిల్లు ప్రాధమిక హక్కులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీనిపై మరింత విస్తృతంగా చర్చలు, సంప్రదింపులు జరగాల్సి వుంది. సరైన రీతిలో చర్చలు జరగకుండా ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టడమనేది ప్రజాస్వామ్య పద్దతిలో శాసనాలను రూపొందించే ప్రక్రియలోని భాగస్వామ్య స్వభావాన్ని విస్మరిస్తోంది.
2016 నుండి ఎఫ్సీఆర్ఏకు వరుసగా చేస్తున్న సవరణలు చూస్తుంటే స్వచ్ఛంద సంస్థల పట్ల ప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలుస్తోంది. ఈ సవరణల ప్రభావం ఎన్జీఓల పనితీరును రాన్రారూ క్లిష్టతరం చేస్తోంది. 2026 బిల్లు ఈ ధోరణికి కొనసాగింపే, పైగా దాతృత్వ, విద్యా, లేదా మానవ హక్కుల రంగాల్లో కృషి కోసం చట్టబద్ధంగా విదేశీ విరాళాలను స్వీకరించే సంస్థలను సమర్ధవంతంగా తుదముట్టిస్తామని బెదిరించడమే. చట్టాన్ని పాటించాలనే ఆవశ్యకత ప్రభుత్వ రాజకీయ వైఖరికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరంగా మారరాదు. ప్రభుత్వంలో మితిమీరిన అధికారమనేది సామాజిక రంగంలో స్వతంత్ర ఆలోచనా ధోరణిని నులిమివేసే వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఈ పై అంశాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఎఫ్సీఆర్ఏ బిల్లును రద్దుచేయాలని సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి బేబీ ఆ లేఖలో ప్రధాని మోడీని కోరారు. సరైన న్యాయ పర్యవేక్షణ లేకుండా ఆస్తులను నిర్వహించే, స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న అన్ని వివాదాస్పదమైన నిబంధనలను ఉపసంహరించుకోవాలి. భవిష్యత్తులో తీసుకువచ్చే ఏ నియంత్రణా పర్యవేక్షణా వ్యవస్థ అయినా సంఘ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛలకు రాజ్యాంగంలో కల్పించిన హామీలకు అనుగుణంగా వుండాలి. ఎఫ్సీఆర్ఏకు తదనంతరం ఏదైనా సవరణలు చేయాలనుకుంటే అందుకు ముందుగా ప్రజలతో, మైనారిటీ సంస్థలతో, న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చలు జరపాలి ఈ సూచనలు, డిమాండ్లపై సానుకూల ప్రతిస్పందన కోసం వేచి చూస్తూ వుంటామని బేబీ ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.



