నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని గంగారం గ్రామ ఉపసర్పంచ్ ములుకల నాగేష్–మానస దంపతుల కుమారుడు శ్రీతన్ పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. తమ ప్రథమ కుమారుడు శ్రీతన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మానవ హక్కుల వికలాంగుల స్వచ్ఛంద సేవా సంస్థ (HMRDS)లో అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంస్థలోని పిల్లలకు నిత్యావసర సరుకులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ ములుకల నాగేష్ మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలకు అనవసర ఖర్చులు చేయడం కంటే ఇలాంటి అవసరమైన వారికి సహాయం చేయడం ఎంతో సార్థకమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, గ్రామస్థులు పాల్గొని దంపతులను అభినందించారు.



