కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డికి కేంద్రం సహాయమందించాలి
హైదరాబాద్లో 32వ సమావేశం నిర్వహించేందుకు సిద్ధం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర–రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడంతోపాటు తీసుకున్న నిర్ణయాల ను వేగంగా అమలు చేయడమే సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భిన్నమైన ప్రయోజనాలు ఎదురైనప్పుడు కూడా న్యాయబద్ధమైన పరిష్కారాన్ని కనుగొనగలగడమే సమాఖ్య వ్యవస్థకు అసలైన పరీక్ష అని తెలిపారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవస్థకు అసలైన పరీక్ష అని తెలిపారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ప్రతిభ కోసం రాష్ట్రాల మధ్య పోటీ సహజమేనని అన్నారు. నదులు, విద్యుత్ గ్రిడ్లు, కార్మికులు, వ్యాపారాలకు రాష్ట్ర సరిహద్దులు అడ్డంకులు కావని చెప్పారు. సమస్యలు రాష్ట్ర సరిహద్దులను ప్రభుత్వ ఫైళ్ల కంటే వేగంగా దాటుతాయని చమత్కరించారు. నిబంధనలు స్పష్టంగా ఉండడంతోపాటు అన్ని రాష్ట్రాలకు ఒకే నిబంధనలు వర్తించాలని కోరారు.
న్యాయమైన నీటి వాటా దక్కాలి
కృష్ణా జలాల్లో తెలంగాణ చాలా స్పష్టంగా ఉందని భట్టి చెప్పారు. ఇప్పటికే ఏర్పాటైన చట్టపరమైన వ్యవస్థల ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాను తెలంగాణ కచ్చితంగా కోరుకుంటోందని అన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను అడ్డుకోవాలనీ, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకే సూత్రాన్ని వర్తింపజేయాలని ఆయన కోరారు. తెలంగాణ– ఏపీ మధ్య కృష్ణా జలాల కేటాయింపు అంశం ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 పరిధిలో ఉందన్నారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించాలని చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయనీ, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించే చర్యలు కూడా ముందుకు సాగుతున్నాయని వివరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడానికి కేంద్రం సహకరించాలన్నారు.
విభజన హామీలను పరిష్కరించాలి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 అమల్లోకి వచ్చి 12 ఏండ్లు గడిచినా తెలుగు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని భట్టి చెప్పారు. విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ సమస్యలకు తుది పరిష్కారం చూపాలని కోరారు. పరిష్కారం అంటే అంతులేని ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించడం కాదనీ, కొన్నేండ్లకు కొత్త అర్థాలు, వివరణలు ఇవ్వడం కూడా కాదని అన్నారు. పెండింగ్ అంశాలు ఇకపై తుది నిర్ణయాలు, సమర్థవంతమైన అమలు దిశగా సాగాలని సూచించారు. షెడ్యూల్–9లోని ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల విభజనకు సంబంధించి 23 సంస్థలపై తెలంగాణ అభిప్రాయాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించిందని వివరించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014కు సంబంధించి సమస్యల పరిష్కారానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని కోరారు. అది తప్పనిసరిగా చట్టపరమైన వ్యవస్థ పరిధిలోనే ఉండాలని సూచించారు. షెడ్యూల్–10 సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజనను ఏపీ కోరుతోందనీ, పునర్వ్యవస్థీకరణ చట్టంలో అందుకు స్పష్టమైన ఆధారం లేవని చెప్పారు. సెక్షన్ 75 కింద సౌకర్యాల కొనసాగింపునకు సంబంధించిన అంశాలు మినహా ఎలాంటి ఆస్తుల విభజనకు చట్టపరమైన మద్దతు లేదని అన్నారు. ఈ అంశం ఏపీ హైకోర్టు పరిధిలో కూడా పెండింగ్లో ఉన్నందున, చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా న్యాయపరమైన ప్రక్రియ ద్వారానే పరిష్కారం కనుగొనాలని కోరారు.
పరస్పరం సహకరించుకోవాలి
నీటి భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, పట్టణీకరణ, రవాణా–లాజిస్టిక్స్, ఆర్థిక పోటీతత్వం వంటి అంశాలు రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కీలక సవాళ్లుగా మారనున్నాయని భట్టి అన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పోటీ పడుతూనే పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దక్షిణాది రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమస్యలకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆకాంక్షించారు. ట్రిబ్యునల్ లేకుండా, కమిటీ లేకుండా, బహుశా మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేకుండా సమస్యలు పరిష్కారం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



