– గత నెలతో పోలిస్తే 7,026 మెట్రిక్ టన్నులు అధికం
– మూడు పరిశ్రమల్లోనూ 72 వేల టన్నులు దాటనున్న ప్రాసెసింగ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్పామ్ గెలల దిగుబడి గణనీయంగా పెరిగింది. గత నెల జూలై తో పోలిస్తే ఆగస్టులో ఇప్పటివరకు 7,026 మెట్రిక్ టన్నుల అదనపు దిగుబడి నమోదైంది. ఆగస్టు నెల ముగిసే లోపు గెలల దిగుబడి 72 వేల మెట్రిక్ టన్నుల మార్కును దాటనుంది. ఇదే సమయంలో మూడు పరిశ్రమల్లోనూ ప్రాసెసింగ్ కూడా 72 వేల మెట్రిక్ టన్నులకు పైగా చేరనుంది. అశ్వారావుపేట, అప్పారావు పేట, సిద్దిపేట పరిశ్రమ మేనేజర్ లు ఎం.ఎన్ కార్తీక్,ఎం.నాగబాబు,ప్రణేష్ లు తెలిపిన వివరాల ప్రకారం పరిశ్రమల వారీగా గణాంకాలు.
పరిశ్రమ జూలై ఆగస్టు వ్యత్యాసం
అశ్వారావుపేట 14,472 15,227 + 755
అప్పారావు పేట 36,509 45,635 + 9,126
సిద్దిపేట 13,460 10,605 – 2,855
మొత్తం 64,441 71,467 +7,026
జూలైలో అశ్వారావుపేట పరిశ్రమలో 14,472, అప్పారావుపేట పరిశ్రమలో 36,509, సిద్దిపేట పరిశ్రమలో 13,460 మెట్రిక్ టన్నుల గెలల దిగుబడి నమోదైంది. మొత్తంగా 64,441 మెట్రిక్ టన్నులు వచ్చింది. కాగా ఆగస్టులో ఇప్పటివరకు అశ్వారావుపేట పరిశ్రమ లో 15,227, అప్పారావు పేట పరిశ్రమ లో 45,635, సిద్దిపేట పరిశ్రమ లో 10,605 మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైంది.మొత్తం దిగుబడి 71,467 మెట్రిక్ టన్నులకు చేరింది. జూలైతో పోలిస్తే ఆగస్టులో 7,026 మెట్రిక్ టన్నుల పెరుగుదల నమోదైంది. మరో 533 మెట్రిక్ టన్నులు నమోదైతే 72 వేల టన్నుల మార్కును అధిగమించనుంది.
అప్పారావుపేట ప్లాంట్లో రోజుకు 1,800 టన్నుల ప్రాసెసింగ్:
ఆయిల్పామ్ గెలల ప్రాసెసింగ్ లోనూ వేగం పెరిగింది. అప్పారావుపేట ప్లాంట్లో గత వారం రోజులుగా నిరంతరాయంగా రోజుకు సుమారు 1,800 మెట్రిక్ టన్నుల చొప్పున ప్రాసెసింగ్ జరుగుతున్నది. మూడు ఫ్యాక్టరీల్లోనూ ఈ నెల ప్రాసెసింగ్ 72 వేల మెట్రిక్ టన్నులు దాటే అవకాశం ఉంది. గెలల దిగుబడి పెరగడంతో పరిశ్రమల్లో ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది.



