– వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ – అశ్వారావుపేట
నిరంతర ఉద్యమాలతోనే కార్మికులు, శ్రామికులు, కర్షకులకు వారి కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని, అందుకోసం అమరజీవి కామ్రేడ్ వేదగిరి శ్రీనివాసరావు స్ఫూర్తితో వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యకాస కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కామ్రేడ్ వేదగిరి శ్రీనివాసరావు 4వ వర్ధంతి సభనూ నిర్వహించారు. ఆయా సభల్లో వెంకట్ మాట్లాడుతూ.. వేదగిరి శ్రీనివాసరావు నిరంతరం పేదల సంక్షేమం కోసం, వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాణం కోసం కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు కూలి బంధు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. దేశంలో బీజేపీ అతి ప్రమాదకరమైన కార్పొరేట్ ప్రభుత్వంగా రుజువయిందన్నారు. దేశ సంపదను కార్పొరేట్లతో కలిసి లూటీ చేస్తూ రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలపై అనేక రకాల భారాలు మోపుతుందన్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా వేదగిరి శ్రీనివాసరావు స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. వేదగిరి ఆచరణ కమ్యూనిస్టుగా ఆదర్శ ప్రజాప్రతినిధిగా, సంఘం జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిటీల్లో వివిధ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించారని కొనియాడారు.
ఆయన స్పూర్తితో ప్రజా ఉద్యమాలు ఉధృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంఘం అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో.. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, నిమ్మల వెంకన్న, ముదిగొండ రాంబాబు, సహాయ కార్యదర్శులు శెట్టి వినోద, గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సుగుణ, తదితరులు పాల్గొన్నారు.