మతం పేరుతో కాదు.. ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలి

మతం పేరుతో కాదు..
ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలి– రైతులు పొద్దు తిరుగుడు సాగుపై దృష్టి పెట్టాలి
– గౌరవెల్లి పూర్తి చేసి ప్రతి ఎకరానికీి నీరందిస్తాం :మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ- హుస్నాబాద్‌ రూరల్‌
రామాలయం లాంటి మతపరమైన అంశాలతో బీజేపీ ఓట్లు అడగడం కాదని, ప్రజాస్వామ్యయుతం గా ఓట్లు అడగాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మార్కెట్‌ యార్డులో పొద్దు తిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో తడి చెత్త, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. 27 నుంచి రూ.500కే గ్యాస్‌ పథకం అమలవుతుండటం తో మహిళలతో కలిసి గ్యాస్‌ సిలిండర్‌కి పూలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సందర్శిం చారు. డయాలసిస్‌ సెంటర్‌తో పాటు 200 పడకల కు అప్‌ గ్రేడ్‌ కావాల్సిన వసతులు, సౌకర్యాలపై వైద్యులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల్లో పొద్దుతిరుగుడు పంటల సాగుపై రైతులు, అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎకరానికి 8-10 క్వింటాల్‌ చొప్పున దిగుబడి వచ్చే ఈ పొద్దు తిరుగుడు విత్తనాల ధర క్వింటాల్‌కు రూ.6760 ఉందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలని తెలిపారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా పూర్తికాక ముందే ప్రేరేపితమైన మాటలతో ప్రభుత్వాన్ని కూలగొడతామని మాట్లాడు తూ ప్రజలను కన్ఫ్యూజ్‌ చేసే పద్ధతిలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సంకల్ప యాత్ర చేస్తున్న బండి సంజరు.. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు.
ప్రజలకు సౌకర్యాలు కల్పించడం మా బాధ్యత
హుస్నాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన బడ్జెట్‌ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడం పాలక వర్గం బాధ్యత అని అన్నారు. అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్‌ శాఖ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులతోనూ ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పోతారం నుంచి వచ్చే వాగులో నీరు.. హుస్నాబాద్‌ టౌన్‌లో ఆగకుండా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీతో రివ్యూ చేశామ న్నారు. ఇక్కడ ఇంటర్నల్‌ రోడ్స్‌కి ఆర్‌ అండ్‌ బీ నుంచి డబ్బులు విడుదల చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ బిల్డింగ్‌ త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. సమావేశం లో పీసీసీ సభ్యులు లింగమూర్తి, సింగిల్‌ విండో చైర్మెన్‌ బోలిశెట్టి శివయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, చిత్తరి పద్మ రవీందర్‌, మాజీ సర్పంచ్‌లు మడప జైపాల్‌ రెడ్డి, బొంగొని శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ ఆకుల రజిత పాల్గొన్నారు.

Spread the love