నవతెలంగాణ – అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో పోలింగ్ సందర్భంగా ఓటరుపై చేయిచేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. నిన్న తెనాలి ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఓటును వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిలబడ్డారు అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ దంపతులు ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్తుండగా గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. గంటల తరబడి తాము క్యూలైన్లో నిలబడితే నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడాన్ని ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే ఓటు వేసి వచ్చిన తరువాత గొట్టిముక్కల సుధాకర్ చెంపపై కొట్టడంతో బాధితుడు కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు.