Friday, June 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపథకం ప్రకారమే సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య

పథకం ప్రకారమే సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య

- Advertisement -

– కేసును ఛేదించిన గద్వాల పోలీసులు
– సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన భార్య, బ్యాంక్‌ మేనేజర్‌
– మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ కేసులా దొరకొద్దని ప్లాన్‌
– ఎనిమిది మంది నిందితుల రిమాండ్‌ : ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసును గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు కలిసి సుపారీ గ్యాంగ్‌తో తేజేశ్వర్‌ను హత్య చేయించినట్టు దర్యాప్తులో తేలింది. బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు గద్వాల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల నుంచి కారు, రెండు కొడవళ్లు, కత్తి, రూ.1.20లక్షలు, 10 మొబైల్‌ ఫోన్‌లు, జీపీఎస్‌ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
మే 18వ తేదీన బీచుపల్లి దేవస్థానంలో తేజేశ్వర్‌, ఐశ్వర్య వివాహం జరిగింది. వారు కొన్ని రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూల్‌ జిల్లాలో కాపురం పెట్టారు. అయితే పెండ్లికి ముందే తేజేశ్వర్‌ను అంతమొందించాలని బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు పన్నాగం పన్నాడు. నాలుగైదు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఐశ్వర్య బ్యాంక్‌ మేనేజర్‌తో సన్నిహితంగా ఉండటం చూసిన తేజేశ్వర్‌ భార్యను గద్వాలకు తీసుకొచ్చాడు. దీంతో తేజేశ్వర్‌ అడ్డు తొలగించుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు తేజేశ్వర్‌ కదలికల కోసం బైక్‌లో జీపీఎస్‌ పరికరం అమర్చారు. జూన్‌ 17న మాయమాటలు చెప్పి తేజేశ్వర్‌ను ఇంటి నుంచి తీసుకెళ్లి కారులోనే సుపారీ గ్యాంగ్‌ సాయంతో హత్య చేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లి నంద్యాల జిల్లా పాణ్యం వద్ద కాల్వలో పడేశారు. సెల్‌ఫోన్‌ కాల్స్‌, కారు ట్రాకింగ్‌ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.
ఈనెల 21న మృతదేహం లభ్యమైంది. అయితే, నిందితులు ఇటీవల మేఘాలయలో జరిగిన హనీమూన్‌ హత్య కేసు గురించి చర్చించుకున్నారు. పోలీసులకు చిక్కకూడదనుకున్నారు. ఇద్దరూ లద్దాఖ్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఐశ్వర్యను రెండో పెండ్లి చేసుకోవాలని తిరుమలరావు ప్రణాళిక వేసుకున్నాడు.
సిబ్బందిని అభినందించిన ఎస్పీ
సంచలనం సృష్టించిన హత్య కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడంలో ప్రతిభ చూపిన గద్వాల పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌ కుమార్‌, రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌, ధరూర్‌ ఎస్‌ఐ కొండా శ్రీ హరి, మల్దకల్‌ ఎస్‌ఐ నందికర్‌, గట్టు ఎస్‌ఐ మల్లేష్‌, ఐటి సెల్‌ ఎస్‌ఐ సుకూర్‌, పి. ఎస్‌ఐలు స్వాతి, తేజేశ్విని, సిబ్బంది చంద్రయ్య పిసి-8221, రాజు యాదవ్‌ పిసి-3111, రామకృష్ణ, పిసి-2204, కిరణ్‌ కుమార్‌, పిసి-383,వీరేశ్‌ పిసి-2553 రవి కుమార్‌ పీసీ-1030, కార్తీక్‌ పిసి-3125ను జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు క్యాష్‌ రివార్డుతో ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -