– కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి
– రైతుల ఆకాంక్షమేరకు నిజామాబాద్లోనే.. పసుపుబోర్డు జాతీయ కార్యాలయం
– ఈ నెల 29న ప్రారంభోత్సవానికి రానున్న అమిత్ షా
– పార్టీలకతీతంగా రైతులు తరలిరావాలని పిలుపు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్రెడ్డి ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోలీస్శాఖతోనే దర్యాప్తు చేయిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీస్ వ్యవస్థపై.. పోలీసుల దర్యాప్తు వల్ల న్యాయం జరిగే అవకాశం ఉందా..? ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ఎమర్జెన్సీ ఎగ్జిబిషన్’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశంలో ఎక్కడ ఇలా జరగలేదని.. ఇద్దరు వ్యక్తుల సంభాషణను వింటూ వాక్ స్వాతంత్రం హక్కును కాలరాశారని అన్నారు. బాత్రూం, బెడ్ రూంలలోకి తొంగిచూసినంత పని చేశారని.. రాజకీయ నాయకులను, సినిమా నటీనటులను, వ్యాపారులను, మీడియా అధినేతల, విలేకరులవి ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టు తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్-కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని నిరూపించేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రెండు పార్టీలు ఒక్కటే అని భావించాల్సి వస్తదని అన్నారు. ఇది వరకే తమ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసిందని, తమ వాదనలు బలంగా వినిపించనున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రైతులు ఉద్యమాలకు కేంద్ర బిందువులని, రాజకీయాలకతీతంగా సంఘటితంగా ఉంటూ చైతన్యంగా ఉంటారని అన్నారు. వారి ఆకాంక్షల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రత్యేక కార్యాచరణతో పసుపు ఉత్పత్తిని పెంచి రైతులకు మేలు జరిగేవిధంగా చూస్తామని చెప్పారు. ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు రైతులు పార్టీలకతీతంగా పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం పసుపు బోర్డు కార్యాలయం పనులు, సభ కోసం పాలిటెక్నిక్ గ్రౌండ్లో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, పసుపు బోర్డు చైర్మెన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES