17నెలలకు పైసలు కట్టి గొప్పలు చెప్పడం
కాలయాపనకు శిక్ష ఎవరు భరించాలో చెప్పాలి
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ – మల్హర్ రావు : ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వయా తాడిచర్ల మీదుగా నిర్మించే రహాదారికి కిషన్ రావుపల్లి వద్ద రోడ్డు నిర్మాణానికి ఫారెస్ట్ క్లియరెన్స్ రాకున్నా మంత్రి రోడ్డు పనులకు శంఖు స్థాపన చేయడం విడ్డూరంగా ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. ఆదివారం మండల కేంద్రమైన తాడిచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. మంథని ఎమ్మెల్యేలో మార్పు వస్తుందని అనేక విషయాలను ఈ సమాజం, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. ఓట్లు వేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా అవకాశం కల్పించిన ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. 2023వ సంవత్సరం 09వ నెలలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్టేజ్1 క్లియరెన్స్కు ఆర్డర్ కాపీ తీసుకువస్తే 10వ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందన్నారు.
ఈ క్రమంలో తాము ఫారెస్ట్కు చెల్లించాల్సిన రూ.4.70కోట్లు చెల్లించలేకపోయామన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆ డబ్బులు చెల్లింపుకు 17నెలలు ఆలస్యం చేశారాని తెలిపారు. ఫారెస్ట్కు డబ్బులు చెల్లించినప్పటికి నేటి వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదన్నారు. ఫారెస్ట్ క్లియరెన్స్ రాకున్నా ఇక్కడ పనులు ప్రారంభం చేస్తున్నట్లుగా శంఖుస్థాపన చేసి ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు.ఈ రహదారి నిర్మాణం చేస్తే 23కిలోమీటర్ల దూరబారం తగ్గుతుందని చెబుతున్నా, మరి 17నెలలు ఆలస్యం చేసి ఈ భారం ఎవరిపై వేయాలే..ఇందుకు ఎవరు బాధ్యులుగా శిక్షభరించాలో చెప్పాలన్నారు.
ఆనాడు రూ.30కోట్లు మంజూరీ చేయించి పనులు పూర్తి చేశామని, కానీ కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే ఫారెస్ట్ అనుమతి లేక ఆగిపోయిందన్నారు. ఆ ఏడు కిలోమీటర్ల పనులు పూర్తి చేసేందుకు 17నెలల కాలం వృధా చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొత్తగా అభివృద్ది పనులు కాకున్నా, ఓ జీఓ తీసుకురాకున్నా ఆగిపోయిన పనులకు శంఖుస్థాపన చేయడం కాంగ్రెస్ కె చెల్లుబాటు అవుతుందన్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనతోనే గొప్పగా పనులు చేస్తున్నామని చెప్పుకోవడానికే ఈ శంఖుస్థాపన చేశారని, స్థానిక నాయకులకు చిత్తశుద్ది ఉంటే నాగులమ్మ గుడి నుంచి తాడిచర్ల వరకు శిథిలమైన రోడ్డును వేయించేలా మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అలాగే అందుగులపల్లి వద్ద ఆగిపోయిన రహదారి పనులను పూర్తి చేయించాలన్నారు. తాడిచర్లను డేంజర్ జోన్ అంటూ మాట్లాడుతున్నా, క్లియర్ చేయించాలని డిమాండ్ చేశారు.
ఓ వైపు ముఖ్యమంత్రి, మరోవైపు ఉపముఖ్యమంత్రితో నిత్యం తిరిగే మంథని ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కేవలం ఈ ప్రాంత ప్రజల ఓట్లకే ఆ కుటుంబం అలవాటు పడిందని, ఎన్నికలు, ఓట్లు వస్తేనే ప్రజలు, పథకాలు, అభివృద్ది పనులు గుర్తుకు వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. రెండు రోజుల క్రితం మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో కొయ్యూర్లో ట్రాన్స్పార్మర్ రిపేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని, ఒక మంత్రి స్థాయిలో ఉండి ట్రాన్స్పార్మర్ సెంటర్ తీసుకురావడమేంటని ప్రశ్నించారు. మంత్రిగా ఓ ఐటీ కంపెనీనో, ఓ ఇండస్త్రీనో తీసుకురావాలే కానీ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కేంద్రం ఏర్పాటు చేస్తామనడం మంత్రి అవివేకానికి నిదర్శమనమన్నారు. ఇప్పటికైనా మండల ప్రజలు చైతన్యవంతులై మంథని ఎమ్మెల్యే మాటలకు మోసపోకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.