– బాన్సువాడ ఆర్డీవో రమేష్ రాథోడ్
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడ డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలను ఆదర్శం గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంతో శ్రీకారం చుట్టిందని, పట్టణ గ్రామ ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని బాన్సువాడ ఆర్డీవో రమేష్ రాథోడ్ అన్నారు. సోమవారం బాన్సువాడ మండలంలోని తడ్కోల్ గ్రామంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆయన రోడ్లను శుభ్రం చేశారు. చిపిరి కట్ట చేత పట్టి గ్రామంలో ఉన్న చెత్తను తొలగించారు. స్థానిక తహశీల్దార్ వర ప్రసాద్, ఎంపిడిఓ తో కలసి గ్రామంలో పలు వార్డులను తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలన్నారు. ప్రతి వార్డు ఎంతో శుభ్రంగా మారిందన్నారు. గ్రామాల్లో పట్టణంలో ప్రగతి ద్వారా శుభ్రం చేసిన వీధుల్లో, ఖాళీ స్థలాల్లో ఎలాంటి చెత్తాచెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాన్సువాడ పట్టణ ప్రగతితో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారిందన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.