రోమానియాకు ఆసియా రెజ్లర్లు

– విదేశీ శిక్షణకు ఆరుగురు మల్లయోధులు
న్యూఢిల్లీ : ఆసియా క్రీడల్లో పోటీపడనున్న ఆరుగురు రెజ్లర్లను క్రీడామంత్రిత్వ శాఖ శుక్రవారం విదేశీ శిక్షణ శిబిరానికి పంపించింది. రోమానియాలో శిక్షణ క్యాంప్‌లో భాగంగా అక్కడ జరుగున్న రెండు కాంపిటీషన్లలో సైతం ఆరుగురు రెజ్లర్లు పోటీపడనున్నారు. ఈ మేరకు క్రీడామంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రీకో రోమన్‌ విభాగంలో పోటీపడుతున్న జ్ఞానేందర్‌ (60 కేజీలు), నీరజ్‌ (67 కేజీలు), వికాశ్‌ (77 కేజీలు), సునీల్‌ కుమార్‌ (87 కేజీలు), నరిందర్‌ చెమ్మ (97 కేజీలు), నవీన్‌ (130 కేజీలు) రోమానియాలో శిక్షణ పొందనున్నారు. ఇందులో వికాశ్‌, సునీల్‌ కుమార్‌, నరిందర్‌లు ఖేలో ఇండియా అథ్లెట్లు కావటం విశేషం. ఆరుగురు రెజ్లర్లు, సహాయక సిబ్బంది పూర్తి ఖర్చులను క్రీడాశాఖ భరించనుంది.

Spread the love