– సెమీస్ చేరిన తెలుగు జట్టు
– ప్రొ పంజా లీగ్ తొలి సీజన్
న్యూఢిల్లీ : ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో తెలుగు రాష్రాల జట్టు, కిరాక్ హైదరాబాద్ టాప్ లేపింది. గ్రూప్ దశలో పది మ్యాచుల్లో ఏకంగా ఎనిమిదింట విజయాలు నమోదు చేసిన కిరాక్ హైదరాబాద్ 137 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్లో ముంబయి మజిల్పై కిరాక్ హైదరాబాద్ 13-9తో గెలుపొందింది. సీజన్లో వరుసగా ఏడో విజయం నమోదు చేసిన కిరాక్ హైదరాబాద్.. వరుస విజయాల ఊపుతో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్లు సిద్దార్థ్ మలాకర్, జగదీశ్, స్టీవ్ థామస్, మధుర, షోయబ్ అక్తర్లు రాణించారు. హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలిపి, సెమీఫైనల్స్కు చేర్చిన ఆర్మ్ రెజ్లర్లను ప్రాంఛైజీ యజమానికి నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్ రెడ్డి అభినందించారు. నేడు జరిగే ప్రొ పంజా లీగ్ సెమీఫైనల్లో రోహతక్ రౌడీస్తో కిరాక్ హైదరాబాద్ తలపడనుండగా.. కోచి కెడి’ఎస్తో ముంబయి మజిల్ పోటీపడనుంది. ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి.