సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌కు గెలుపు

– ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనకి మళ్లీ ఎమ్మెల్యే టికెట్‌ వచ్చినందుకు శ్రీ నందీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
– నందివనపర్తి శివుని గుడితో ఆయనకు ప్రత్యేక అనుబంధం
– పెద్ద ఎత్తున స్వాగతం పలికిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ గెలుపునకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ మళ్లీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్టు ఆయనకు కేటాయించడంతో మంగళవారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తి శ్రీ నందీశ్వర ఆలయంలో శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఈ పూజా కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ తాను ఏ ఒక్క శుభ కార్యక్రమం చేయాలన్నా, నందివనపర్తి శివాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే మొదలు పెడుతానిని చెప్పారు. శ్రీ నందీశ్వరుని ఆశీస్సులతోనే తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు గుర్తు చేశారు. అందుకే ఇక్కడి నుంచి సెంటిమెంట్‌గా ఒక నమ్మకంతో స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపారు. శివుడి ఆశీస్సులతో మళ్లీ ఇబ్రహీంపట్నం గడ్డపైన గులాబీ జెండా రెపరెపలాడుతోందన్నారు. ఎవరేన్ని అడ్డంకులు సృష్టించినా మళ్లీ గులాబీ జండానే ఎగురుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటినుంచి పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా గెలుపు కోసం కంకణబద్ధులై పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి పాశ్చ భాష, పీఎసీఎస్‌ చైర్మన్‌ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు బిలకంటి శేఖర్‌ రెడ్డి, వర్త్యవత్‌ రాజు నాయక్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తలారి మల్లేష్‌, చిన్నోళ్ళ యాదయ్య, జోగి రెడ్డి, సర్పంచులు కంబాళ్లపల్లి ఉదయశ్రీ, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love