బహిరంగ ప్రదేశాల్లో జీవ వ్యర్థాలు
గృహ వ్యర్థాలతోపాటే పడేస్తున్న క్లినిక్ల నిర్వాహకులు
చెత్తకుప్పలు, డంపింగ్ యార్డుల్లో..
పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు
ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, క్లినిక్లపై తనిఖీలు, చర్యలు శూన్యం
జీ రేణుయాదవ్
గ్రేటర్ హైదరాబాద్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులు జీవ వ్యర్థాలను విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. గల్లీలు, మున్సిపాల్టీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. గృహ వ్యర్థాలతోపాటే బయో వ్యర్థాలనూ పడేస్తుండటంతో చెత్త కుప్పలు, డంపింగ్ యార్డుల వద్ద పారిశుధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తను తొలగించే, సేకరించేవారు ప్రాణాంతర వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, క్లినిక్లపై ఎప్పటికప్పుడూ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేసి, చర్యలు తీసుకోకపోవడంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గృహ వ్యర్థాలతోపాటే..
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చిన్న చిన్న క్లినిక్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బయో వ్యర్థాలు సైతం పెద్ద మొత్తంలో పోగవుతున్నాయి. ఆయా సెంటర్లలో వాడిన సిరింజీలు, సెలైన్ బాటిళ్లు, సూదులు, గాయాలకు డ్రెస్సింగ్ చేసిన దూది, మూత్రపు పైపులు, మాస్కులు, చేతి గ్లౌజులు తదితర వ్యర్థాలను పెద్ద మొత్తంలో బహిరంగ ప్రదేశాలు, చెత్త కుప్పలు, డంపింగ్ యార్డుల్లో పడేస్తున్నారు. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా మున్సిపల్ చెత్త కుప్పలు, నిర్మానుష్య ప్రదేశాల్లో పడేసి వెళ్తున్నారు.
ఆ మూటల్లో ఏముందో తెలియకపోవడంతో మున్సిపాల్టీ సిబ్బంది వాటిని కూడా డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, గల్లీలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నుంచి వచ్చే వ్యర్థాలను విచ్చలనిడిగా బహిరంగ ప్రదేశాలు, పురపాలక చెత్త వ్యాన్లలోనూ పడేస్తున్నారు. చాలాచోట్ల ఇంట్లోనే క్లినిక్లు నిర్వహిస్తుండటంతో బయో వ్యర్థాలను కూడా గృహ వ్యర్థాలతో కలిపి డస్ట్ బిన్ కవర్ల ద్వారా చెత్త బండ్లలో వేస్తున్నారు. దీంతో చెత్తను తొలగించే వారు, సేకరించేవారు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి, పురపాలక అధికారులు తమకు ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
నిబంధనలకు తూట్లు..!
క్లినిక్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నుంచి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల దాకా బయో మెడికల్ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించాలి. నిబంధన లు పాటించని సెంటర్లపై మున్సిపాల్టీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ నిబంధనలు- 2016 ప్రకారం సురక్షితంగా, శాస్త్రీయంగా నిర్వహించాల్సి ఉన్నా.. కొన్ని క్లినిక్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారం గా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. గృహ వ్యర్థాలతోపాటే పారబోయడం వల్ల బయో మెడికల్ వ్యర్థాల్లో ఉండిపోయిన కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ వల్ల చెత్తను తొలగించే సిబ్బంది వ్యాధుల బారిన పడే పరిస్థితి ఏర్పడుతోంది. బయో వ్యర్థాలు గాలి, నీటిలో కలిసిపోవడం వల్ల కాలుష్యం ఏర్పడి ప్రాణాంతక వ్యాధులు సైతం వచ్చే అవకాశాలున్నాయి. పారిశుధ్య కార్మికులు వీటిని తొలగించే క్రమంలో సూదులు, ఫ్లోర్ సిప్పులు గుచ్చుకుని ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాద ముంది. వాటిని తొలగించే క్రమంలో సిబ్బందికి హెపటైటిస్, హెచ్ఐవీ, టీబీ వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
ఫిర్యాదులొచ్చినా చర్యలు శూన్యం
గ్రేటర్ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులు జీవ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారని ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి జీవ వ్యర్థాలను సేకరించే వాహనాలకు లైసెన్సులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది తప్పితే వాటిని అన్ని రకాల ఆస్పత్రులు వినియోగించుకుంటున్నాయా..? లేదా..? అనేది పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టి అత్యంత ప్రమాదకరమైన కాలుష్య, వ్యాధి కారకులను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తనిఖీలు చేయని పీసీబీ
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సుప్తావస్థలోకి వెళ్లిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో కనీస తనిఖీలు, బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలనీలు, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణపై కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆస్పత్రులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, గృహ వ్యర్థాల డంపింగ్ యార్డుల్లో ర్యాండమ్ తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అప్పుడప్పుడు, అక్కడక్కడ తనిఖీలు చేస్తున్నారు తప్పితే పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు.