వచ్చే ఏడాది ‘ సీఎం బ్రేక్ఫాస్ట్’ను తెలంగాణలోనూ చేపడతాం
పేదలకు అండగా తమిళనాడు సీఎం : ‘విద్యలో తమిళనాడు ముందంజ’ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తమిళనాడులో తీసుకువచ్చిన కామరాజ్ విద్యా విధానం దేశానికే ఆదర్శమనీ, ఈ విధానాన్ని దేశం అనుసరిస్తున్నదని తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. తమిళనాడులో కొనసాగిస్తున్న ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ కార్యక్రమం హృదయాన్ని తాకుతున్నదని తెలిపారు. తెలంగాణాలోనూ ఈ పథకాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేదలకు అండగా ఉన్నారని అన్నారు. అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని కొనియాడారు. గురువారం చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘విద్యలో తమిళనాడు ముందంజ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కరుణానిధి విజన్ను అమలు చేస్తున్న స్టాలిన్, ఉదయనిధిలను అభినందిస్తున్నానని చెప్పారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్ను తీసుకువచ్చారని గుర్తు చేశారు. నాన్ ముదలవన్ (స్కిల్ డెవలప్మెంట్) రూ.10 వేల ఉపకార వేతనం స్కీమ్లు ప్రభుత్వ కళాశాలలకు వెళ్లే బాలురు, బాలికల కోసం ఉండడం అదష్టమని అభిప్రాయపడ్డారు.
ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సాంస్కృతిక చారిత్రకపరమైన బలమైన సంబంధం ఉందని వ్యాఖ్యానించారు. 1991 సరళీకరణ తర్వాత ఆర్థిక విధానాలతో తమిళనాడులో తయారీ రంగం అభివద్ధి చెందిందని చెప్పారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివద్ధి చెందాయని వివరించారు. సామాజిక న్యాయం అమలులో తమిళనాడు-తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయని చెప్పారు. మేం కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నామన్నారు. తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం, మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. భారతీయులంతా తమిళనాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారని తెలిపారు. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమేనని గుర్తు చేశారు. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం తమకు ప్రేరణ కలిగించిందని చెప్పారు. దక్షిణాదికి చెందిన కేరళ, కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నా విద్యా శాఖను తన వద్దే ఉంచుకున్నట్టు వివరించారు. తెలంగాణలో నైపుణ్యత పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతియేటా తెలంగాణ నుంచి 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని వివరించారు. నైపుణ్యలేమితో ఉద్యోగాలు దక్కకపోతుండడంతో వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినట్టు చెప్పారు. పీపీపీ విధానంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశామనీ, దానికి ఆనంద్ మహేంద్రను ఛైర్మెన్గా, కార్పొరేట్ సంస్థల అధిపతులను డైరెక్టర్లుగా నియమించామని తెలిపారు. అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించామనీ, ఇక్కడ అనేక మంది క్రికెట్, టెన్నిస్, ఇతర క్రీడాకారులు ఉన్నారని చెప్పారు. దేశంలో రూ. 140 కోట్ల మంది జనాభా ఉన్నా ఒలింపిక్స్లో మనకు ఒక్క గోల్డ్ మెడల్ రాలేదని గుర్తు చేశారు. నాలుగు నుంచి ఐదు కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడల్స్ వచ్చాయని చెప్పారు. 30 ఎకరాలు ఉన్న దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వాళ్లకే 16 గోల్డ్ మెడల్స్ దక్కాయన్నారు. ఒక క్రీడాకారిణికే మూడు అర్చరీ గోల్డ్ మెడల్స్ వచ్చాయనీ, మరి మన విజయ గాథ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో మనం ఎక్కడ ఉన్నామనీ, ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 56 అంగుళాల ఛాతీతో ఏం ప్రయోజ నమన్నారు.
అందుకే మేం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించాననీ, అందులో సంజరు గోయెంకా, అభినవ్ బింద్రా, కపిల్దేవ్, ఉపాసన కొణిదెల వంటి క్రీడాకారులు, కార్పొరేట్ వాళ్లను తీసుకున్నామన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీని సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమిళనాడు-తెలంగాణ మధ్య సాంస్కృతిక స్నేహ సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. తమిళ విద్యార్థులు, కోచ్లకు స్పోర్ట్స్ యూనివర్సిటీలో అవకాశాలు కల్పిస్తామన్నారు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించే బాధ్యత తెలంగాణ-తమిళనాడు తీసుకుంటాయనీ, మోడీ, అమిత్షాతో అది సాధ్యం కాదన్నారు. గతంలో మైనారిటీలకు వేర్వేరు పాఠశాలలు ఉండేవనీ, మేము, వారు వేర్వేరని అనుకోవడం లేదని అన్నారు. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. మైనారిటీ విద్యార్థులంతా ఒకే చోట ఉండి చదువుకుంటారని చెప్పారు.
ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను 25ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. 1956లో ప్రారంభించిన ఐటీఐల్లో ఇప్పటికీ అదే సిలబస్ కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికీ డీజిల్ మెకానిక్, ప్లంబర్ ట్రైనింగ్ ఇస్తున్నారని వివరించారు. అక్కడ శిక్షణ తీసుకున్న వారికి ఉపాధి లభించడం లేదన్నారు. టాటా కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా చేస్తున్నామన్నారు. ఇటీవలే మేము నూతన విద్యా విధానం తీసుకువచ్చామన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి నర్సరీ ప్రారంభిస్తున్నామని వివరించారు. తమిళనాడులో మాదిరిగానే తెలంగాణలో కూడా అనేక ఉన్నత విద్యా సంస్థలున్నాయని గుర్తు చేశారు. తమిళనాడు, తెలంగాణ దేశానికి రోడ్మ్యాప్ ఇవ్వనున్నాయని అభిప్రాయపడ్డారు. నాలెడ్జ్ హబ్ కానున్నాయని చెప్పారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం ఎంకెస్టాలిన్, విద్యాశాఖ మంత్రి ఉదయనిధి, ఎంపీ కనిమొళి తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండండి
నిరంతరం మానిటర్ చేయండి : అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. విపత్తుల నిర్వహణా శాఖ ఆయా జిల్లాల్లో ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్, రహదారులు, పోలీస్ విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.