ప్రత్యేక అతిథిగా మంత్రి తుమ్మల
గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన నారాయణపురంలో దసరా వేడుకల సందర్భంగా మంత్రి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజల ఆప్యాయత ను స్ఫూర్తిగా తీసుకుని.. గ్రామస్థులతో కలిసి దసరా ఆనందాన్ని పంచుకున్నారు. స్వగ్రామంలో మంత్రి ప్రత్యేక భోజన ఏర్పాట్ల ద్వారా గ్రామ ప్రజలు, నాయకులను ఆహ్వానించి ఆప్యాయతతో కలసి భోజనం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి పండుగను జరుపుకున్న మంత్రి స్థానికులకు మరింత ఆనందాన్ని పంచారు.
పొంగులేటి ఆతిధ్యం స్వీకరించిన వారిలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నవరాత్రులు నిష్టతో, నియమాలతో ఆచరించిన భక్తుల కోరికలను అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, సుఖసంతోషాలు ప్రతి తెలుగు ఇంటిలో వర్ధిల్లాలని తెలిపారు.