రేపటి నుంచి అమలు
మూడు స్టేజీల వరకు రూ.5..స్టేజీ దాటితే బాదుడే
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జంట నగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో చార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచింది. ఈనెల 6వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. అలాగే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ తర్వాత రూ.10 అదనంగా వసూలు చేయనున్నారు.
రాబోయే రెండేండ్లలో హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల 2,800 ఎలక్ట్రిక్ బస్సులను డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఇందుకోసం పది కొత్త డిపోలు, పది చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ సదుపాయాల ఏర్పాటు, నిర్వహణకు అదనపు వ్యయాలు ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చార్జీల పెంపు చేయాల్సి వచ్చిందని, ప్రజలు సహకరించాలని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.