ఆటోను ఢకొీట్టిన కారు

 ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
క్షతగ్రాతులను హైదరాబాద్‌కు తరలింపు
నవతెలంగాణ-పరిగి
వికారాబాద్‌ జిల్లా పరిగి మున్సిపల్‌ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర బాయిలర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్‌ ఆటోను కారు ఢకొీట్టడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిగి ఎస్‌ఐ విఠల్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గండీడ్‌ మండలం వెన్నచేడ్‌కు చెందిన ప్యాసింజర్‌ ఆటో వివిధ గ్రామాల నుంచి ప్యాసింజర్లను ఎక్కించుకొని పరిగికి వస్తోంది. ఈ ఆటోలో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, ఐదుగురు పురుషులు ఉన్నారు. పరిగి మున్సిపల్‌ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర బాయిలర్‌ మిషన్‌ వద్ద హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై పరిగి నుంచి కొడంగల్‌ వెళ్తున్న కారు అజాగ్రత్తగా, రాష్‌ డ్రైవింగ్‌తో రావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ప్యాసింజర్‌ ఆటోను ఢ కొట్టింది. ఆటోలో ఉన్న 15 మందిలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి. తొమ్మిది మందిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో దోమ మండలం పీర్లగుట్ట తాండాకు చెందిన హెమ్లీ బారు (55), గుండాలకు చెందిన శశికళ (35), కొత్తపల్లికి చెందిన అంజిలమ్మ (65) మృతి చెందారు. క్షతగ్రాతులకు హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Spread the love