చెట్టును ఢీకొన్న కారు.. కొత్త దంపతులు సజీవ దహనం

నవతెలంగాణ- భోపాల్‌: ఒక కారు చెట్టును ఢీకొన్నది. ఆ కారులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న కొత్త దంపతులతో సహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు ఒక చెట్టును వేగంగా ఢీకొన్నది. దీంతో ఆ కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ఒక మహిళ, ముగ్గురు మగవారు మంటలంటుకున్న కారు నుంచి బయటకు రాలేకపోయారు. దీంతో వారు మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక శకటంతో సహా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఒక మహిళతోసహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఆరేళ్ల కిందట పెళ్లైన కొత్త దంపతులు కూడా మృతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Spread the love