సాఫ్ట్‌ సిగల్‌కు తెర

జూన్‌ 1 నుంచి
ఐసీసీ కొత్త రూల్స్‌
దుబారు : అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) జూన్‌ 1, 2023 నుంచి సరికొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఇటీవల ప్రపంచ క్రికెట్‌లో దుమారానికి కారణమైన పలు సంఘటనలతో మేల్కొన్న ఐసీసీ క్రికెట్‌ కమిటీ.. పలు నిబంధనల్లో మార్పులు, చేర్పులకు సిద్ధమైంది. మ్యాచ్‌లో ఫీల్డర్‌ క్యాచ్‌ అందుకున్న సమయంలో క్యాచ్‌పై స్పష్టత కోసం ఫీల్డ్‌ అంపైర్లు సాఫ్ట్‌ సిగల్‌ అనంతరమే మూడో అంపైర్‌ను సంప్రదించాలి. టీవీ రిప్లేలో ఫీల్డ్‌ అంపైర్ల సాఫ్ట్‌ సిగల్‌ను తిరస్కరించేందుకు థర్డ్‌ అంపైర్‌కు ఆధారం దొరకపోతే.. అప్పుడు సాఫ్ట్‌ సిగల్‌నే తుది నిర్ణయంగా పరిగణిస్తున్నారు. ఐసీసీ నూతన నిబంధనలతో ఇది మారనుంది. సాఫ్ట్‌ సిగల్‌ (అవుట్‌, నాటౌట్‌) నిర్ణయం అవసరం లేకుండానే ఫీల్డ్‌ అంపైర్లు నేరుగా టీవీ అంపైర్‌కు నివేదిస్తారు. టీవీ అంపైర్‌ ఈ విషయంలో తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఇక ఇటీవల ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో నో బాల్‌కు విరాట్‌ కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. వికెట్లను తగిలిన బంతి బౌండరీకి చేరువగా వెళ్లటంతో కోహ్లి వికెట్ల మధ్య కీలక పరుగులు తీశాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అప్పట్లో ఐసీసీ ఆ పరుగులను ఎక్స్‌ట్రాలుగా పరిగణించింది. కానీ, కొత్త రూల్స్‌ ప్రకారం నో బాల్‌ (ప్రీ హిట్‌)కు బ్యాటర్‌ బౌల్డ్‌ అయితే.. ఆ పరుగులు సైతం బ్యాటర్‌ ఖాతాలోకే వెళ్తాయి. దీనితో పాటు బ్యాటర్లకు చేరువగా ఫీల్డింగ్‌ చేసున్న ఫీల్డర్లు కచ్చితంగా ప్యాడ్లు, హెల్మెట్‌ ధరించాలనే నిబంధనను ప్రవేశపెట్టారు. జూన్‌ 7-11న ది ఓవల్‌ మైదానంలో జరిగే ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కొత్త నిబంధనల ప్రకారం జరుగనుంది. బారత్‌, ఆస్ట్రేలియా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే. సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ కమిటీ నూతన నిబంధనలను రూపొందించగా.. ఐసీసీ ఉమెన్స్‌ క్రికెట్‌ కమిటీ అంగీకారం తెలిపింది. ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నూతన నిబంధనలకు ఆమోద ముద్ర వేసింది.

Spread the love