పెన్షన్ల గురించి…

పెన్షన్ల గురించి...మనకిప్పుడు ఒక వింత దృశ్యం కనిపి స్తోంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల లోకెల్లా మనది అతి వేగంగా అభివృద్ధి చెందు తున్న దేశంగా ప్రధానమంత్రి మొదలు ప్రభు త్వ అధికార ప్రతినిధులందరూ అదేపనిగా విసుగెత్తిపోయేలా ప్రచారం చేస్తూనే వున్నారు. త్వరలోనే అది 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కానుందని, జీడీపీ వృద్ధి రేటులో చైనానే మించిపోతుందని గొప్పలు పోతున్నారు. అదే ప్రభుత్వ ప్రతినిధులు, నాయకులు పాత పెన్షన్‌ విధానం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగు లకు పెన్షన్‌ చెల్లించే విషయం వచ్చేసరికి ప్రభు త్వం దగ్గర నిధులు లేవని ప్రకటిస్తున్నారు. ఇక అసంఘటిత రంగంలో పనిచేస్తూ, ఎటువంటి పెన్షన్‌ సదు పాయమూ లేని కోట్లాదిమంది కార్మికులకు సార్వత్రిక పెన్షన్‌ చెల్లించే సంగతి గురించి చెప్పేదేముంది?
ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ తన దేశంలోని వృద్ధులకు పెన్షన్లు చెల్లించే పరిస్థి తిలో లేదు. అంతే కాదు, తన దేశంలోని మాతృ మూర్తులకు కడుపు నిండా తిండి పెట్టలేని స్థితిలో ఉంది. 15 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్కులైన స్త్రీలలో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య, సంక్షేమ సర్వే వెల్లడించింది. ఇది 2019-20 నాటి సర్వే. ఇక ప్రపంచంలోనే అతి వేగంగా పెరుగుతున్న మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆకలి సూచికలో 125 దేశాలకు గాను 111వ స్థానంలో ఉంది. అంటే తన ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించలేని స్థితిలో ఉంది. కనీసం 2200 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని రోజూ పొందలేకపోతే అట్టివారు నిష్టదరిద్రంలో ఉన్నట్టేనని పాత ప్లానింగ్‌ కమిషన్‌ నిర్ధారించింది. ఆ విధంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 80 శాతం మంది నిష్ట దరిద్రులు ఉన్నారు. 2017-18 జాతీయ శాంపిల్‌ సర్వేలో ఈ విషయం బయటపడింది.
కొత్త పెన్షన్‌ స్కీములో పెన్షన్‌ కోసం ఉద్యోగుల జీతాల నుండి ప్రతీ నెలా మినహాయిస్తున్నారు. పాత పెన్షన్‌ విధానం అటువంటిది కాదు. ఆ విధానం ప్రకారం పెన్షన్‌ అనేది ఉద్యోగి హక్కు. దానిని చెల్లించే బాధ్యత యజ మాని అయిన ప్రభుత్వానిదే. అయితే ఆ పాత పెన్షన్‌ విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్న వారందరికీ ప్రభుత్వ అధికార ప్రతినిధులు, మంత్రులు అందరూ చెప్తున్న సమాధానం ఒక్కటే. ”ప్రభుత్వం దగ్గర అంత స్తోమత లేదు”. పాత పెన్షన్‌ విధానంలో ఉద్యోగి రిటైర్‌ అయేనాటికి అతనికి, లేదా ఆమెకు వచ్చే నెల జీతంలో బేసిక్‌ పే, కరువు భత్యం లెక్కించి, అందులో సగం పెన్షన్‌గా చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత పెరిగే ధరలకు అనుగుణంగా ఆ పెన్షన్‌ను సవరి స్తారు. ధరల పెరుగుదల ప్రభావాన్ని పరిగణించి, నిజ పెన్షన్‌ విలువను అందుకు అనుగుణంగా లెక్కిస్తే ఆ పెన్షన్‌లో నిజానికి ఏ పెరుగుదలా లేనట్టే.
ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ 6-7 శాతం చొప్పున ప్రతీ ఏడూ పెరుగుతోంది. కాని పెన్షనర్ల సంఖ్య అంత వేగంగా పెరగడం లేదు. అంటే జీడీపీిలో పెన్షన్‌ కోసం చెల్లించే మొత్తం శాతం (జీడీపీకి పెన్షన్‌ మొత్తానికి మధ్య నిష్పత్తి) ఏటికేడూ పడిపో తోందన్న మాట. అలా పడిపోతున్నప్పుడు ఆ పెన్షన్‌ చెల్లిం చడం ప్రభుత్వానికి ఏండ్లు గడుస్తున్న కొద్దీ తేలిక కావాలి. ప్రభుత్వం చెప్పే లెక్కల్ని బట్టే ఇది నిర్ధారణ అవు తోంది. కాని, ఇందుకు పూర్తి విరు ద్ధంగా పాత పెన్షన్‌ విధానాన్ని అందరికీ వర్తింపజేయడం మోయలేని భారం అవుతుందని ఎందుకు ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు? అంటే జీడీపీ వృద్ధి వేగంగా ఉన్న కాలంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బలహీన పడు తున్నట్టు అనుకోవాలి. ఏ విధంగా చూసినా, అలా అనుకోలేము. అసలు కారణం ఏమంటే, ఈ ప్రభుత్వం జీడీపీలో మరింత ఎక్కువ వాటా పెట్టుబడిదారులకు దక్కేలా చేయా లని భావిస్తోంది. అలా చేయడాన్ని సమర్ధించుకోడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఒక వాదన ఉండనేవుంది. పెట్టుబడిదారులకు ఎంత ఎక్కువ వాటా దక్కితే అంత ఎక్కువగా వాళ్లు పెట్టుబడులు పెట్టి జీడీపీ మరింత ఎక్కువగా వృద్ధి చెంద డానికి తోడ్పడతారు అన్నదే ఆ వాదన.
ఈ వాదన ఏ మాత్రమూ సమర్ధనీయం కాదు. పెట్టుబడి దారులకు ఎక్కువ ధనాన్ని ఇస్తే వాళ్లు ఎక్కువ పెట్టుబడులు పెడతారు అనే వాదన ఎంత పసలేనిదో దాదాపు ఒక శతాబ్దం క్రితమే బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్త అయిన కీన్స్‌, పోలిష్‌ ఆర్థిక వేత్త, మార్క్సిస్టు అయిన మైకేల్‌ కాలెక్కీ నిరూపించారు. పెట్టు బడిదారీ ఆర్థిక వ్యవస్థలో సప్లైకి తగిన స్థాయిలో డిమాండ్‌ లేని పరిస్థితే సాధారణంగా కొనసాగుతూ వుంటుంది. అటు వంటి వ్యవస్థలో ఉత్పత్తి, పెట్టుబడి, వృద్ధి పెరగాలంటే దానికి ముందు పెరగవలసినది మొత్తం డిమాండ్‌. అంతే కాని, పెట్టుబడిదారులకు ధనాన్ని ఎక్కువ ధారపోస్తే దానివలన ప్రయోజనం ఉండదు. ఈ సంగతి మోడీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కాని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడానికి తిరస్కరిస్తోంది. దానిని బట్టి ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల పక్షాన వ్యవహరిస్తున్న ప్రభుత్వం అని స్పష్టమవుతోంది.
ప్రభుత్వం జీడీపీ వృద్ధి రేటు పెరుగుదల పట్ల ప్రదర్శి స్తున్న ఈ వ్యామోహం, ఆ వృద్ధిరేటు గురించి ప్రచారం చేసు కుంటున్న తీరు అర్ధరహితం. ఇటువంటి ధోరణినే గతంలో కొందరు మహారాజులు ప్రదర్శించారు. ప్రజలకి ఉపాధి లేకుండా చేసి, వాళ్లు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నప్పుడు బల వంతంగా వాళ్లతో చాకిరీ చేయించి పెద్ద పెద్ద కోటలను, రాజ హర్మ్యాలను నిర్మించారు. తమ పాలనలో ఎంతో అభివృద్ధి జరి గిందంటూ గొప్పలు పోయేవారు. అందుకు తార్కాణంగా ఆ కోటలను, భవంతులను చూపించేవారు. ఈ క్రమంలో ప్రజల పట్ల తమ ప్రవర్తన ఎంత అమానవీయంగా ఉన్నా అది వాళ్లకేమీ పట్టేదేకాదు. బహుశా అడుక్కుతినే స్థితి లో ప్రజలు ఉండడం గర్వకారణంగా వాళ్లు పరిగణించివుండాలి. అదే మాదిరిగా ఇప్పుడు కూడా కోట్లాదిమంది వృద్ధులు అత్యంత దయనీయ స్థితిలో జీవించే టందుకు నెట్టబడుతున్నారు. వారి లో చాలా తక్కువ మందికి ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రూ.200 దక్కుతోంది. అది చాలా స్వల్పం. ఇలా జరగడా నికి కారణం ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు లేకపోవడం ఎంత మాత్రమూ కానేకాదు. వనరులను పెట్టుబడిదారు లకు కట్టబెట్టడమే కారణం. ఆ విధంగా కట్టబెట్టడాన్ని సమర్ధించుకోడానికి ప్రభు త్వం చేస్తున్న వాదన బొత్తిగా అర్ధం లేనిది.
ఈ వనరుల సమస్యను మరికాస్త వివరంగా పరిశీ లిద్దాం. 2018-19 నాటికి దేశంలో 60 ఏండ్లు పైబడినవారు సుమారు 13 కోట్ల మంది ఉన్నారు. వాళ్లు జీవించడానికి నెలకు తలా రూ.3వేలు కావాలి. ఆ ఏడాది స్థూల జాతీయ ఆదాయం రూ.187 లక్షల కోట్లు, లేదా రూ.187 ట్రిలియన్లు. వృద్ధులకు గనుక నెలకు తలా రూ.3000 చొప్పున చెల్లించాలంటే అందుకు కావలసిన మొత్తం స్థూల జాతీయాదాయంలో 2.5 శాతం మాత్రమే. ఈ మొత్తాన్ని చెల్లించాక దానిని అందుకున్న పెన్షనర్లు తిరిగి దానిని ఖర్చు చేస్తారు. ఆ ఖర్చులో పన్నుల రూపంలో ప్రభుత్వానికి తిరిగి కనీసం 30 శాతం వెనక్కి వచ్చేస్తుంది. అంటే నికరంగా ప్రభుత్వం పెన్షన్లకోసం తన స్థూల జాతీయాదాయంలో 1.75 శాతం కేటాయిస్తే సరిపోతుంది. ఈ మొత్తాన్ని సమకూర్చు కోడానికి సంపన్నుల మీద ఒక శాతం సంపద పన్ను విధిస్తే చాలు. అలా ఒక శాతం పన్ను అదనంగా విధించినంత మాత్రాన ఆ సంపన్నుల విని మయం ఏమీ తగ్గిపోదు. అందుచేత ఇతరత్రా పెన్షన్‌ సదుపాయం లేని వృద్ధులకు నెలకు రూ.3వేల చొప్పున సార్వత్రిక పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడానికి వనరుల కొరతేమీ లేదు.
2018-19తో పోల్చితే ఇప్పటికి పెన్షన్‌ పొందే అర్హత కలవారి సంఖ్య ఇంకా పెరిగివుంటుంది కదా అన్న సందేహం రావచ్చు. అలాగే 2018 నాటిి రూ. 3వేలు ఇప్పటి ధరలకు అనుగుణంగా సవరిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా? అటువంటప్పుడు ఆర్థిక భారం ఇంకా ఎక్కువ అవుతుంది కదా? అని సందేహం వస్తుంది కూడా. ఆ సందేహానికి ఆస్కారం లేదు. ఈ కాలంలో జాతీయ ఆదాయం కూడా పెరిగింది గనుక పెన్షనర్లకు చెల్లించే మొత్తం కూడా అందులో ఒకానొక శాతంగా ఉంటుంది గనుక అది కూడా పెరుగు తుంది. ఒకవేళ ఇప్పుడు కూడా రూ.3వేల చొప్పున మాత్రమే చెల్లించాలనుకుంటే ఆ శాతం తగ్గుతుంది కూడా.
ప్రస్తుతం నయా ఉదారవాద వ్యవస్థ అధికోత్పత్తి సంక్షో భంలో తీవ్రంగా కూరుకుపోతున్న పరిస్థితుల్లో. ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా ఆ సంక్షోభాన్ని నివారించడానికి పూనుకోవచ్చు. అలా చేసినందువలన సామాన్య ప్రజలకు కాస్తంత గౌరవప్రదమైన జీవన పరిస్థితులను కల్పించినట్టూ ఔతుంది. కాని నయా ఉదారవాదం సంపన్నుల మీద పన్ను లను పెంచడానికి ఒప్పుకోదు. అటు ద్రవ్యలోటును పెంచి ప్రభుత్వం ఖర్చు చేయడానికీ ఒప్పుకోదు. అందుచేత ఈ నయా ఉదారవాద చట్రంలో ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూ న్నంత కాలమూ పెన్షన్‌ సమస్యకు పరిష్కారం లభించదు. సంక్షోభాన్ని, దాని భారాలను ఎదిరించి పోరాడే క్రమంలో నూతన వ్యవస్థను నిర్మించుకోవడమే పరిష్కారం.

(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love