రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలకు హాజరైన అజిత్ డోవల్

నవతెలంగాణ – జెద్దా: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ముఖ్యంగా ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనపై చర్చించేందుకు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ సౌదీ అరేబియా చేరుకున్నారు. జెద్దాలో ఆయనకు సౌదీలో భారత రాయబారి సుహెల్ ఖాన్, కాన్సుల్ జనరల్ మొహమ్మద్ షాహిబ్ అలామ్ స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌పై చర్చించేందుకు జెద్దాలో ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ డోవల్ పాల్గొంటున్నట్టు రియాద్‌లో భారత రాయబార కార్యాలయం ఓ ట్వీట్‌లో తెలియజేసింది. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈనెల 5,6 తేదీల్లో జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించిన శాంతి ఎజెండాన్ని సమావేశం చర్చిస్తుంది. ఇండియాతో పాటు చిలీ, ఈజిప్ట్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పోలాండ్, యూకే, అమెరికా, జాంబియా దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పది పాయింట్లలో కూడిన ఉక్రెయిన్‌ పీస్ ఫార్ములా అమలు వల్ల ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనడంతో పాటు, ప్రపంచంలో భవిష్యత్తుల్లో తలెత్తితే ఘర్షణలను ప్రతిఘటించే ఒక మెకానిజం ఏర్పాటు చేసే వీలుంటుందని జెలెన్‌స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ తెలిపారు.

Spread the love