ప్రియురాలితో గొడవ.. ఫోన్ మాట్లాడుతూ ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రేమించిన యువతితో గొడవపడిన ఆమెతోనే ఫోన్‌ మాట్లాడుతూ బలవన్మరణానికి ఓ యువకుడు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్‌కు చెందిన ఇమ్రోజ్‌పటేల్‌(29) కొన్ని సంవత్సరాలుగా రాజేంద్రనగర్‌లోని పరమారెడ్డిహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రయివేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ యువతి ఇమ్రోజ్‌ను దూరం పెట్టింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్రోజ్‌పటేల్‌ మంగళవారం రాత్రి తాను నివసించే ఫ్లాట్‌ నుంచి ఆ యువతికి ఫోన్‌ చేశాడు. కొద్దిసేపు మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే ఆమె అక్కడికి దగ్గరలో ఉండే మరో స్నేహితుడికి ఫోన్లో విషయం చెప్పి ఇమ్రోజ్‌పటేల్‌ ఫ్లాట్‌కు వెళ్లాలని సూచించింది. ఆయన వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లో దుప్పటితో ఉరివేసుకొని ఇమ్రోజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Spread the love