రూ96వేల ఫోన్​..21లక్షల లీటర్ల నీటిని వేస్ట్​ చేసిన అధికారి

నవతెలంగాణ-హైదరాబాద్ : రూ.96 వేల ఫోన్​ కోసం ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని రిజర్వాయర్​ నుంచి బయటకు తోడించారు ఛత్తీస్​గఢ్​కు చెందిన ఫుడ్​ ఇన్‌స్పెక్టర్‌. అందుకు అధికారులు కూడా ఆయనకు సహకరించడం గమనార్హం. దాదాపు మొత్తం గ్రామ ప్రజల సాగు, తాగు నీరు అవసరాలను తీర్చే ఆ జలాశయంలో ఉన్న లక్షల లీటర్ల నీటిని తన స్వార్థం కోసం విడుదల చేయించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆ రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం భుపేశ్​ బఘేల్​ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కాంకేర్​ జిల్లాలోని కోయిలిబెడ బ్లాక్‌కు చెందిన ఫుడ్ ఆఫీసర్ రాజేశ్​ విశ్వాస్​ విహారయాత్ర కోసం సోమవారం ఖేర్‌కట్టా పర్‌కోట్ రిజర్వాయర్‌కు వెళ్లారు. అక్కడ ఆయన సరదాగా సెల్ఫీ దిగుతున్న సమయంలో సుమారు రూ.96 వేల రూపాయల విలువైన శామ్​సంగ్​ ఫోన్​ రిజర్వాయర్‌లో పడిపోయింది. దీంతో తన ఫోన్​ను ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలనే ఆశతో జలవనరుల శాఖ అధికారులకు ఫోన్​ చేశారు. వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం.. రిజర్వాయర్​​ నుంచి ఎలాగైనా నీటిని తోడించి ఫోన్​ను అప్పజెప్తామని రాజేశ్​కు హామీ ఇచ్చింది. కొంతసేపటికే హుటాహుటిన 30హెచ్​పీ సామర్థ్యం కలిగిన పంపులతో జలవనరుల శాఖ సిబ్బంది ఆ జలాశయం వద్దకు చేరుకుంది. అందులో ఉన్న నీటిని బయటకు పంపించే పనిని ప్రారంభించారు. మూడు రోజులు గడిచే సరికి సుమారు 21 లక్షల లీటర్ల నీటిని బయటకు వృథాగా పంపించారు. ఎట్టకేలకు గురువారం ఫుడ్​ ఇన్‌స్పెక్టర్‌​ రాజేశ్​ విశ్వాస్​కు చెందిన ఖరీదైన ఫోన్​ను బయటకు తీయగలిగారు. అయినా ఆ ఫోన్​ ఆన్​ కాలేదు. ఫుడ్​ ఇన్‌స్పెక్టర్‌​ రాజేశ్​ ఫోన్​ పడ్డ రిజర్వాయర్​లో 15 అడుగుల మేర నీరు నిండి ఉంది. అయితే జలాశయం నుంచి నీటిని తోడి ఫోన్​ బయటకు తీయమని ఆదేశించిన మాట వాస్తవేమనని అధికారులు చెప్పారు. అయితే కేవలం 5 అడుగుల నీరును మాత్రమే తీయమన్నామని.. కానీ సిబ్బంది మాత్రం 10 అడుగుల వరకు నీటిని తొలగించిందని జలవనరుల శాఖ ఎస్‌డీఓ రామ్​ లాల్ ధివర్ తెలిపారు.
కేవలం రూ.96 వేల ఫోన్​ కోసం నీటిని వృథా చేయిస్తారా అంటూ ప్రతిపక్షాలు.. బఘేల్​ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.ఈ వ్యవహారంపై స్పందించిన ఆ రాష్ట్ర మంత్రి అమర్జీత్ భగత్​ విచారణ పూర్తయ్యాక బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Spread the love