– టీపీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ
– సెప్టెంబర్లో అభ్యర్థుల ప్రకటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకుగాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సెప్టెంబర్లో ప్రకటించనున్నది. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ఎన్నికల కమిటీ, టీపీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధర్, సభ్యులు బాబా సిద్ధికీ, జిగేష్ మేవాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్టు తెలిపారు. దామోదర రాజనర్సింహ చైర్మెన్గా, రోహిత్ చౌదరి, మహేష్ గౌడ్ సభ్యులుగా సబ్ కమిటీ ఏర్పాటు చేశామనీ, ఆ కమిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి విధివిధానాలు, రుసుములపై నివేదిస్తుందని తెలిపారు. ఈ నెల 17 వరకు విధివిధానాలు ఖరారవుతాయనీ, 18 నుంచి 25 వరకు డీడీ రూపంలో రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. టికెట్ ఆశించేవారు గాంధీభవన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ‘సెప్టెంబర్ మొదటి వారంలో మరోసారి ఎన్నికల కమిటి సమావేశం నిర్వహించి దరఖాస్తులను పరిశీలించి పీఈసిలో సమర్పిస్తాం. వాటిని స్క్రినింగ్ కమిటీకి పంపిస్తాం. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వడం కుదరదు. పూర్తి స్థాయిలో సర్వేలు ఆధారం కాదు. కానీ సర్వేలు కూడా పరిగణలోకి తీసుకుంటాం. అభ్యర్థుల ఎంపిక ప్రధాన భూమిక పీఈసిదే. సరైన అభ్యర్థిని నిర్ణయించేది పీఈసి, స్క్రినింగ్ కమిటి, ఆ తరువాత సీఈసీ, సీడబ్ల్యూసీ….’ అని వారు తెలిపారు.