– నదిలో పడ్డ వాహనాలు … నలుగురు గల్లంతు
గాంధీనగర్ :. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో వంతెనలు కూలిపోతున్నాయి. గతేడాది మోర్బీ ప్రాంతంలో తీగల వంతెన కూలి వంద మందికి పైగా సందర్శకులు చనిపోయిన విషయం విదితమే. తాజాగా గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం, సురేంద్రనగర్ జిల్లా వస్తాడి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ జాతీయ రహదారిని చురకు కలుపుతూ వంతెనను నిర్మించారు.ఈ వంతెనపై వాహనాలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వంతెన అమాంతంగా పేకమేడలా కూలిపోయింది. ట్రక్కులతో సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఆ వాహనాల్లో ఉన్న పదిమంది కూడా మునిగిపోయారు, వారిలో ఆరుగురిని కాపాడారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీములు గాలిస్తున్నాయి.