హామీలు అమలు చేయకపోతే మరో పోరాటం..

– ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎస్‌.రమ
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
ఐకేపీ వీఓఏ ఉద్యోగులకు గత 44 రోజులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్‌.రమ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీఓఏల నల్లగొండ జిల్లా విస్తత స్థాయి సమావేశం దొడ్డి కొమరయ్య భవన్‌లో కే.శరత్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీవోఏల న్యాయమైన డిమాండ్‌ల పరిష్కారానికి కషి చేస్తానని, వేతనాలు పెంచుతామని, ఐడి కార్డులు,10 లక్షల ప్రమాద బీమా, 58 జీవో సవరణ ఇతర సమస్యలు యూనియన్‌తో చర్చలు జరిపి నెల రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మాట తప్పితే మరో పోరాటం తప్పదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వీవోఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ సమ్మె చేసిన వివోఏలపై సీసీలు, ఏపీఎంలు, డిపిఎంలు వివిధ పనుల పేరుతో కక్ష సాధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో 44 రోజులపాటు మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా వీరోచితమైన పోరాటం చేసిన వీవోఏలందరికీ సీఐటీయూ జిల్లా కమిటీ పోరాట అభినందనలు తెలియజేస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో వీవోఏలంతా తమ హక్కుల కోసం ఐక్యమత్యంతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
చేరికలు… నూతన కమిటీ..
బీఆర్‌టీయూ సంఘం వివిధ మండలాల వీవోఏలు సీఐటీయూలో చేరారు. సమావేశ అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా సిహెచ్‌. లక్ష్మీనారాయణ, అధ్యక్షులుగా కె.శరత్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా చిలుముల దుర్గయ్య, కోశాధికారిగా ఎస్‌కే. సైదాబేగం, ఉపాధ్యక్షులుగా ఎం.జంగయ్య, సులోచన, ఎం.మంగమ్మ, జి.సువర్ణ, సహాయ కార్యదర్శిలుగా లలిత, పాపయ్య, అహల్య, మునినాయక్‌, కె.రేణుక ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, చంద్రకళ, సుమలత, శేఖర్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love