మౌలిక వసతులు కల్పించాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయి ఉన్న బిల్లులను, గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా కమిటీ సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే. కరీమున్నీసా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్యాహ్నం భోజన కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కష్టనష్టాలను భరిస్తూ ప్రభుత్వం తమ కష్టాలను ఏనాడైనా గుర్తిస్తుందని పని చేస్తా ఉంటే కార్మికులకు సుమారుగా నాలుగు నెలల బిల్లులు పెండింగ్లో ఉండడం వలన అప్పులు తెచ్చిన దగ్గర ఒత్తిడి పెరుగుతుండడం వలన కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే పెండింగ్ బకాయి బిల్లులు, వేతనాలు పెంచిన వేతనంతో కలిపి చెల్లించాలన్నారు. పథకం ప్రారంభంలో ఇచ్చిన వంట పాత్రలు పలుచ భారాయని, తక్షణమే వంట పాత్రలు వంట షెడ్లు లేని చోట షెడ్లు నిర్మించి ఇవ్వాలని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జ్ పెంచి ఒక్కొక్క విద్యార్థికి స్లాబ్ రేటు 20 రూపాయలు చొప్పున నిర్ణయించి ఇవ్వాలని, కార్మికులకు కాటన్ దుస్తులు ఇవ్వాలని, కోడిగుడ్లు అంగన్వాడి కేంద్రాల మాదిరి ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని, వంటగ్యాస్ వంటకు సరిపడ పూర్తిగా ఉచితంగా సప్లై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను మరియు ఇతర ప్రజాసంఘాలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులపై అధికారులను పలుమార్లు కలిసినప్పటికీని బిల్లులు పెండింగ్లో లేవని ఫిబ్రవరి వరకు చెల్లింపులు జరిగినాయని అధికారులు తప్పుడు సమాచారం చెప్తున్నారని ఆరోపించారు. తక్షణమే రావలసిన బకాయిలను చెల్లించి వారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి కిన్నెర సైదమ్మ, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డి ఆండాలు, ఏకుల మహేశ్వరి, బొజ్జ అలివేలు, సుక్క సైదమ్మ, కొనగోని పద్మ, పంగరెక్క రుతు, చెరుకుపల్లి సత్తెమ్మ, నల్ల వెంకటమ్మ, జాకటి లక్ష్మి, పల్లె సైదమ్మ, వంగూరి రేణుక, దారమళ్ళ స్వప్న, చెడుపల్లి కౌసల్య, పోలగాని పద్మ తదితరులు పాల్గొన్నారు.