•ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్
నవతెలంగాణ – మర్రిగూడ
తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి పేదల ఇంటి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాన్ని ఆపాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్ అన్నారు. సోమవారం మండలంలోని ఖుదాబక్షపల్లి గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ గ్రామంలో బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన 188 గజాల ఇంటి స్థలాన్ని అక్రమంగా స్వాధీనపరచుకొని అందులో మహిళా సమైక్య భవన నిర్మాణం ఏర్పాటు చేయుటకు మండల అధికారులు, గ్రామ సర్పంచ్ ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఈ క్రమంలో పూర్వకాలం నుండి తమకు వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాన్ని ఇవ్వమని వారసులు అడ్డు పడుతుండడంతో వారిపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ స్థలం విషయంలో ఇటీవల రెండు దఫాలుగా తాహసిల్దార్, ఎంపీఓ గ్రామంలో విచారణ చేపట్టగా ఆ స్థలం వడ్డెర సామాజిక వర్గానికి చెందినదే అని గ్రామ ప్రజలు, పెద్దలు చెప్పడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పైన ఫోర్జరీ కేసు నమోదు చేయడం సమంజసం కాదని, కనీసం ఆ వ్యక్తికి అక్షర జ్ఞానం కూడా రాదన్నారు.
ఈ విషయం పైన ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఇస్కిళ్ళ మహేందర్, గ్రామ శాఖ మేతరి యాదయ్య, సీనియర్ నాయకులు ఎర్రజాల మహేందర్, సహాయ కార్యదర్శి యాదగిరి, ఏ ఐ వై ఎఫ్ మండల సహాయ కార్యదర్శి పొట్ట అశోక్, పొట్టగిరి, జంగిలి వెంకన్న, బొమ్మరగొని హనుమంతు, గోగు శేఖర్, గోల్కొండ లింగం, తదితరులు పాల్గొన్నారు.



