– ఇంటర్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రయివేటుగా హాజరయ్యే విద్యార్థులకు హాజరు మినహాయింపు దరఖాస్తు గడువు వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఉందని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి శృతి ఓజా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హాజరు మినహాయింపు కోసం గురువారం నోటిఫికేషన్ను విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థులు హాజరు మినహాయింపు ఫీజు రూ.500 చెల్లించాలని కోరారు. ఆర్ట్స్/హ్యుమానిటీస్కు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు tsbie.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.